Mutton Meal Issue in Marriage: ప్రాంతాలను బట్టి పెళ్లి భోజనాలు మారుతుంటాయి. తెలంగాణలో పెళ్లి భోజనం అంటే.. ఖచ్చితంగా ముక్క ఉండాల్సిందే. ఆ పెళ్లిలో ముక్క వడ్డించలేదో.. గొడవలు జరిగిపోతాయి. పెళ్లి విందులో చేయాల్సిన మర్యాదలు చేయలేదన్న కారణంగా పెళ్లిళ్లే ఆగిపోయిన ఘటనలున్నాయి. ముఖ్యంగా విందు విషయంలో వధూవరుల బంధువుల మధ్య ఏదొక మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. నల్లి బొక్కలు పడలేదని ఒకరు, నాకు భోజనంలో వడ్డనే సరిగ్గా చేయలేదని ఇంకొకరు, ముక్కలే వేయలేదని మరొకరు.. ఇలా ఏదొక రభస చేస్తూనే ఉంటారు.
అరె.. కొత్తగా పెళ్లి చేసుకున్నారు. నూతన వధూవరులు కలకాలం సంతోషంగా ఉండాలని ఆశీర్వదించడానికి వచ్చాం.. భోజనంలో ఒక్కోసారి అలాంటివి జరుగుతుంటాయిలే అని ఎవరూ లైట్ తీసుకోరు. ఎవరెలా పోయినా.. తమకు జరగాల్సిన మర్యాద జరగాల్సిందేనంటారు.
Also Read: భర్తకు మరో యువతితో దగ్గరుండి మరీ పెళ్లి చేసిన సతీమణి.. ఎందుకంటే?
తాజాగా.. పెళ్లిలో మటన్ ముక్కలు తక్కువ వేశారంటూ వరుడి ఫ్రెండ్స్ నానా రచ్చ చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. నవీపేటకు చెందిన యువతితో.. నందిపేట మండలానికి చెందిన యువకుడికి బుధవారం స్థానిక ఫంక్షన్ హాలులో ఘనంగా వివాహం జరిపించారు పెద్దలు. పెళ్లికి వచ్చిన వరుడి తరపు యువకులు.. విందులో కూర్చున్నారు. అయితే తమకు మటన్ ముక్కలు తక్కువ వేశారని వడ్డిస్తున్న వ్యక్తులతో వాదనకు దిగారు.
ఏమైందని అక్కడికి వచ్చిన వధువు బంధువులు ఆరా తీశారు. ఏదో తెలియక జరిగిందని చెప్పినా వరుడి తరపు యువకులు వినకపోవడంతో వాగ్వాదం తీవ్రమైంది. చేతికి అందిన వంట గరిటెలు, కర్రలు, రాళ్లతో ఇరువర్గాలు దాడి చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఈ ఘటనలో 13 మందిపై కేసు నమోదు చేశారు. గాయపడిన 8 మందిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు.