Paris Paralympics 2024 Opening Ceremony Highlights: పారిస్ ఒలింపిక్స్ అట్టహాసంగా ముగిశాయి. కానీ విధి వంచించినా, తల వంచని ధైర్యంతో ఎందరికో స్ఫూర్తిమంతంగా నిలిచే పారా ఒలింపిక్స్ అథ్లెట్ల సందడి మొదలైంది. ఒలింపిక్స్ జరిగిన అదే వేదికపై అత్యద్భుతంగా పారా ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి.
గతానికి భిన్నంగా నగరం మధ్యలో ఓపెన్ ఎయిర్లో చారిత్రాత్మక డిలా కాంకార్డ్ వేదికగా బుధవారం రాత్రి ఆరంభ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టెయన్ మీర్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు పీటర్ పావెల్ తో సహా పలువురు దేశ విదేశాల నుంచి ప్రముఖులు తరలి వచ్చారు.
అంతర్జాతీయ నటుడు,మార్షల్ ఆర్ట్స్ లో లెజండ్.. జాకీ చాన్ కూడా వచ్చి పారా ఒలింపిక్స్ లో సందడి చేసి, అథ్లెట్లను ఉత్సాహపరిచారు. స్ఫూర్తివంతమైన ప్రసంగం చేశారు. అలాగే పారా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పలు సాంస్క్రతిక కార్యక్రమాలు అలరించాయి.
Also Read: వార్నీ.. ఏఐ ఎంత పనిచేసింది.. గిల్-కోహ్లీ మధ్య ఫిట్టింగ్ పెట్టేసింది!
టోక్యో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు సాధించారు. అక్కడ 24వ స్థానంతో మెరిశారు. టోక్యో గేమ్స్ కి 54 మంది మాత్రమే వెళితే.. ఈసారి 30మంది ఎక్కువగా వెళుతున్నారు. అందుకని పతకాల సంఖ్య కూడా పెరిగే అవకాశాలున్నాయి. ఈసారి పారా ఒలింపిక్స్ కి తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు అథ్లెట్లు వెళ్లారు.
అన్ని అవయవాలు చక్కగా ఉండి, ఖాళీగా తిరిగే యువత ఎంతోమందికి పారా ఒలింపిక్స్ క్రీడాకారులు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.