Mopidevi hot comments: ఎట్టకేలకు పార్టీ మార్పుపై నోరు విప్పారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. ఫ్యాన్ పార్టీ నుంచి ఎందుకు బయటకు రావడానికి గల కారణాలు, పార్టీ వ్యవహార శైలి, జగన్ ఆలోచన తీరుపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారాయన. ఈ క్రమంలో ఆ పార్టీ గురించి కీలక విషయాలు బయటపెట్టారు ఎంపీ మోపిదేవి.
వైసీపీకి రాజీనామా చేశారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. తన రాజీనామా పత్రాలను రాజ్యసభ ఛైర్మన్కు అందజేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కీలక విషయాలు ప్రస్తావించారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్కు తనకు విభేదాలు ఉన్నాయని మనసులోని మాట బయటపెట్టారు. వాటి గురించి తాను బయటకు చెప్పలేనన్నారు. ఎమ్మెల్యే టికెట్ నిరాకరించినప్పుడే రాజీనామా చేయాలని భావించానని కాకపోతే వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు.
వైసీపీ ప్రజలకు సంక్షేమం అందించిందని, అభివృద్ధిని గాలికి వదిలేసిందన్నారు ఎంపీ మోపిదేవి. సంక్షేమం-అభివృద్ధి రెండు బేరీజు వేసుకుంటూ పాలన సాగాలని, కానీ జగన్ అలా చేయలేదన్నారు. రాజకీయ కక్ష సాధింపులకు జగన్ దిగారని దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు తాము వద్దని చెప్పామని ఏ మాత్రం లెక్క చేయలేదన్నారు. ఈ విషయంలో నిరంకుశ ధోరణితో జగన్ వ్యవహరించారని, అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారని గుర్తు చేశారు.
ALSO READ: దిశ పోలీస్ స్టేషన్ల పేరు మార్పు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
ప్రజలు తీర్పుతో చివరకు వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా పోయిందన్నారు మోపిదేవి వెంకటరమణ. జగన్ వ్యవహారశైలి నచ్చక పార్టీకి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తాను చూడని అధికారం, పదవులు లేవని, కేవలం అధికారం కోసం టీడీపీలో చేరలేదన్నారు.
యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలని తాను అనుకుంటున్నానని, అందుకోసమే పార్టీ మారినట్టు తెలిపారు. చంద్రబాబు సర్కార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరనే ఉద్దేశంతో జాయిన్ అయ్యానని వెల్లడించారు. తనతోపాటు బీద మస్తాన్రావు రాజీనామా చేస్తున్నానని తెలిపారు. రాజ్యసభ ఎంపీ పదవిపై తనకు మొదటి నుంచి ఆసక్తి లేదని, ఏడాదిగా తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో తీవ్ర ఇబ్బందిపడ్డానని వెల్లడించారు. లోపం ఎక్కడ వుందో వైసీపీ హైకమాండ్ విశ్లేషించుకోవాలన్నారు.