Lover Attack on Young Woman With Knife at Gachibowli: మహిళలపై ఒకవైపు హత్యాచారాలు, మరోవైపు ప్రేమోన్మాది దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కొంతమంది ప్రేమ పేరిట దాడులు, మోసాలు, హింసాత్మక చర్యలు పాల్పడుతున్నారు. కొన్నాళ్లు ప్రేమించడడం లేదా వెంటపడడం చేస్తున్నారు. ఆ తర్వాత ప్రేమ వికటించినా తిరస్కరించిన హింసాత్మక దాడులకు తెగబడడం పెరిగిపోతుంది. మరికొంతమంది ప్రేమించమని వెంటపడుతున్నారు. ప్రేమను ఒప్పుకుంటే మృగంలా మారి దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా. హైదరాబాద్లో మరో దారుణం చోటుచేసుకుంది.
హైదరాబాద్ శివారులోని గచ్చిబౌలి పరిధిలో ఉన్న గోపన్పల్లి తండాలో రాత్రి ప్రేమించిన యువతిని ఓ ఉన్మాది అతికిరాతంగా పొడిచి చంపేశాడు. బెంగాల్కు చెందిన దీపనను కర్ణాటకకు చెందిన రాకేశ్ కూరగాయల కత్తితో పొడిచి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో అడ్డొచ్చినా ఆమె స్నేహితులపై కూడా దాడి చేశాడు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం ఆత్మహత్య చేసేకునేందుకు కనకమామిడి వద్ద విద్యుత్ స్తంభం ఎక్కి హల్ చల్ చేశాడు.
ఈ ఘటనపై స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్కు చెందిన దీపన తమాంగ్(25) బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్కు వచ్చింది. గచ్చిబౌలి స్టేషన్ పరిధిలోని గోపన్పల్లి తండా సమీపంలో తన స్నేహితులతో కలిసి నివాసం ఉంటుంది. అలాగే నల్లగండ్ల అపర్నలో బ్యూటీషియన్గా పనిచేస్తుంది. ఇటీవల ఆమెకు కర్ణాటక బీదర్ ప్రాంతానికి చెందిన రాకేశ్తో పరిచయం ఏర్పడింది. అతడు మాదాపూర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో నివాసం ఉంటున్నాడు.
అప్పుడప్పుడు కలుస్తుండడంతో ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నాడు. అయితే రాకేష్ మాత్రం తనను పెళ్లి చేసుకోవాలని దీపన వెంట తిరుగుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆమె మాత్రం పెళ్లికి నిరాకరిస్తూ ఉంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లిన రాకేష్.. మరోసారి పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. రాకేష్ వెంటనే కోపంతో అక్కడ ఉన్న కూరగాయల కత్తితో దీపనపై కిరాతంగా దాడి చేసి పొడిచాడు.
వెంటనే ఆమె స్నేహితులు రాకేష్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆవేశంతో ఉన్న రాకేష్ వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో అక్కడ ఉన్న అందరూ గాయపడ్డారు. కానీ దీపనపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత అక్కడి నుంచి పారిపోయి మొయినాబాద్ సమీపంలోని కనకమామిడి వద్ద కరెంట్ స్తంభం ఎక్కడానికి ప్రయత్నించగా.. కరెంట్ షాక్ తగలడంతో గాయాలయ్యాయి.
Also Read: భర్త ఎదురుగానే ప్రియుడితో తిరిగే భార్య.. చివరికి ఏమైందంటే!
ఈ దాడిలో గాయపడిన దీపన స్నేహితులను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే గాయపడిన రాకేష్ను కనకమామిడిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే ఏడాదికాలంగా రాకేష్ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ దాడి నగరవాసులను భయాందోళనకు గురిచేస్తుంది.