CM Chandrababu Good News To Pensioners: పెన్షన్దారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతినెలా 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు అందిస్తున్నారు. అయితే ఈ సారి ఒక్కరోజు ముందుగానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆగస్టు 31న పెన్షన్దారులకు పెన్షన్లు అందనున్నాయి.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రతినెల 1వ తేదిన పంపిణీ చేస్తున్నారు. అయితే సెప్టెంబర్ 1 ఆదివారం రావడంతోపాటు అదే రోజు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్టు 31వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వచ్చి ఇవ్వనున్నారు.
ఈ నేపథ్యంలో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ అందనుంది. ఒకవేళ ఆగస్టు 31న లబ్ధిదారులు పెన్షన్లను తీసుకోని సమక్షంలో వారికి సెప్టెంబర్ 2న సోమవారం అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. అంతకుముందు ఏపీ కేబినేట్ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ నగదును పెంచింది. గత ప్రభుత్వం రూ.3వేలు అందజేస్తుండగా..కూటమి ప్రభుత్వం రూ.1000 పెంచి మొత్తం రూ.4వేలు అందజేస్తుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఇంటి వద్దనే పింఛన్ డబ్బులను లబ్ధిదారులకు అందించగా..కూటమి ప్రభుత్వం కూడా ఇంటివద్ద అందజేస్తుంది. కానీ వార్డు వాలంటీర్లకు బదులు..సచివాలయ సిబ్బంది నేరుగా నగదు అందజేస్తున్నారు.