BRS MLA: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. రాజశేఖర్ రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ విద్యా సంస్థ, మరో విద్యా సంస్థకు ఉపశమనం లభించింది. హైడ్రా కూల్చివేతల నుంచి వీటికి వారం రోజులపాటు రక్షణ లభించింది. ఈ ఏడు రోజుల వరకు చిన్న దామెర చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలకు సంబంధించి స్టే విధించింది. సంబంధిత డాక్యుమెంట్లతో ఏడు రోజుల్లోగా తహశీల్దార్ను కలిసి వాదనలు వినిపించాలని ఆదేశించింది. వాదనల తర్వాత చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని తహశీల్దార్లనూ ఆదేశించింది.
కాబట్టి, ఈ ఏడు రోజుల వరకు తహశీల్దార్ కూల్చివేత సహా ఎలాంటి చర్యలూ చేపట్టరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎంఎల్ఆర్ సహా మారుతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎరోనాటికల్ ఇంజినీరింగ్కు కూడా ఊరట లభించింది. ఇదిలా ఉండగా, సీహెచ్ సత్తిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు జరిగాయి. భూమి సర్వే చేయకుండానే గండిమైసమ్మ తహశీల్దార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని వాదించారు.
విద్యార్థుల అకాడమిక్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విద్యా సంస్థల భవనాలు, నిర్మాణాలను హైడ్రా కూల్చి వేయడం లేదని న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తెచ్చారు. సెలవుల్లో మాత్రమే చర్యలు తీసుకుంటామని, ముందు నోటీసులు జారీ చేసి వారు తొలగించకుంటే తాము యాక్షన్ తీసుకుంటామని హైడ్రా చేసిన ప్రకటనను వివరించారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కళాశాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ, ఎరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు పంపారు. చిన్న దామెర చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని ఒక ఎకరాలో వీరు కళాశాల భవనాలు నిర్మించారు. అలాగే.. మరో మూడు ఎకరాల్లో పార్కింగ్కు స్థలాలు కేటాయించారు. కాలేజీ రోడ్లకు మరో 2.24 ఎకరాల భూమిని ఆక్రమించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వివరణ ఇవ్వాలని రెవెన్యూ అధికారులు ఆ నోటీసుల్లో వారిని ప్రశ్నించారు.
Also Read:Nandamuri Balakrishna: వింటేజ్ లుక్ లో బాలయ్య.. లుక్ అదిరిపోయింది
ఈ నోటీసులు అందగానే వారు హైకోర్టు మెట్లు ఎక్కారు. తమ కాలేజీ భవనాలను హైడ్రా కూల్చేయకుండా ముందస్తుగా రక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్ పై వాదనలు విన్న తర్వాత హైకోర్టు వారం రోజులపాటు ఈ భవనాలపై స్టే విధించింది. ఈ వారం రోజులు డాక్యుమెంట్లతో వాదనలు వినిపించి, నిజానిజాలు నిగ్గు తేల్చాలని పేర్కొంది. ఆ తర్వాత రెవెన్యూ అధికారులను చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని స్పష్టం చేసింది.
హైడ్రా మరో అడుగు ముందుకు వేయనుంది. అక్రమ కట్టడాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైడ్రా చట్టం తీసుకువస్తున్నట్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. హైడ్రా పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, అప్పుడు ప్రజలు నేరుగా అక్కడికి వచ్చి ఫిర్యాదులు ఇవ్వవచ్చునని తెలిపారు. అలాగే, అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అవినీతి అధికారులపైనా హైడ్రా పోలీసు స్టేషన్ యాక్షన్ తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇది వరకే ఇలాంటి కొందరు అవినీతి అధికారులను గుర్తించినట్టు తెలిపారు.