in search of father, son reaches india from Japan: 2016లో విడుదలైన సినిమా ‘లయన్’ను తలపించే ఘటన తాజాగా చోటుచేసుకుంది. తన కుటుంబం ఎక్కడున్నదో తెలియని వేదన.. గతం వెంటాడుతుంటే వారిని చేరుకోవాలనే తపనతో ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు చేరుకుంటాడు ఈ సినిమాలోని హీరో. ఈ సినిమా కూడా నిజజీవితం ఆధారంగా తెరకెక్కిందే. అచ్చంగా ఇలాగే… తన కుటుంబాన్ని వెతుక్కుంటూ 21 ఏళ్ల కుర్రాడు జపాన్ నుంచి ఇండియాకు చేరాడు. 19 ఏళ్ల తర్వాత కన్నకొడుకును చూసిన తండ్రి హత్తుకుని చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. ఈ క్షణం కోసం 19 ఏళ్లు ఎదురుచూశా.. చిన్నా అంటూ కంటతడి పెట్టుకున్నాడు. తండ్రిని చేరుకున్నాననే ఆనందంలో కొడుకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ భావోద్వేగ క్షణాలు పంజాబ్లో చోటుచేసుకున్నాయి. ఈ తండ్రీ కొడుకుల కథ ఏమిటంటే?
పంజాబ్లోని అమృత్సర్కు చెందిన సుఖ్పాల్ థాయ్లాండ్ వెళ్లాడు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతుండగా ఎయిర్ పోర్టులో జపాన్కు చెందిన సచియె టకాహట పరిచయమైంది. ఫ్లైట్లో సుఖ్పాల్ పక్క సీటే సచియేది. మాట కలిపారు. ఒకరి అభిరుచులు మరొకరికి నచ్చాయి. తాజ్ మహల్ చూడటానికి సచియె ఇండియా వస్తున్నది. తాను వాగా బార్డర్, గోల్డెన్ టెంపుల్ చూపిస్తా అని సుఖ్పాల్ ఆఫర్ చేశాడు. అందుకు సచియె అంగీకరించింది.
చెప్పినట్టుగానే ఆమెకు ఆ రెండు ప్లేస్లు చూపించాడు. అప్పుడు సుఖ్పాల్ కుటుంబంతోనే 20 రోజుల దాకా ఉండిపోయింది. సుఖ్పాల్ కుటుంబంతో కలిసిపోయింది. జపాన్ వెళ్లాక స్పాన్సర్షిప్ పత్రాలు పంపింది. ఆ పరిచయం అలాగే కొనసాగింది. 2002లో తొలిసారిగా సుఖ్పాల్ జపాన్ వెళ్లాడు. అక్కడే పెళ్లి చేసుకున్నారు. 2003లో రిన్ టకాహట పుట్టాడు. సుఖ్పాల్, సచియె అక్కడే కొన్నాళ్లు కలిసి ఉన్నారు. కానీ, కుటుంబ బాధ్యతలు అర్థం చేసుకునేంత వయసు అప్పుడు తనకు లేదని సుఖ్పాల్ వివరించాడు. దీంతో తామిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని తెలిపాడు.
Also Read: HYDRA: హైడ్రాకు హైపవర్.. రాష్ట్రవ్యాప్తంగా ఫుల్ క్రేజ్
ఆ తర్వాత సుఖ్పాల్ ఒక్కడే ఇండియాకు తిరిగి వచ్చేశాడు. కానీ, సర్దుకుని దాంపత్యం కొనసాగించుకోవాలని ఇద్దరూ అనుకున్నారు. అప్పుడు సచియె ఇండియాకు వచ్చి.. సుఖ్పాల్ను వెంటపెట్టుకుని జపాన్కు తీసుకెళ్లింది. 2004లో వీరిద్దరూ విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అప్పుడు కొడుకు రిన్ వయసు 18 నెలలు. సుఖ్పాల్ ఇండియాకు తిరిగి వచ్చేశాడు. మళ్లి ఎప్పుడూ జపాన్కు వెళ్లలేదు. కొడుకును కూడా చూడలేదు.
కానీ, రిన్ టకాహటకు తండ్రి కావాలని బలమైన కోరిక ఏర్పడింది. స్కూల్లో ఫ్యామిలీ ట్రీ గీయమన్నప్పుడు తనకు నాన్న పేరు మాత్రమే తెలుసనేది రిన్కు అవగాహనలోకి వచ్చింది. అప్పుడు నాన్న గురించి అమ్మను అడిగి తెలుసుకున్నాడు. ఫొటోలు చూశాడు. ఇతర బంధువుల నుంచి కూడా వివరాలు సేకరించాడు. తన తండ్రిని కలవాలనే బలమైన కాంక్షతో అన్వేషణ మొదలుపెట్టాడు. తల్లి నుంచి సేకరించిన చిరునామాను గూగుల్ మ్యాప్స్లో టైప్ చేసి ఏరియా చూశాడు. వయసుతోపాటు తండ్రిని చూడాలనే సంకల్పమూ పెరుగుతూ వచ్చింది. రిన్ తన 21వ యేటా ఫ్లైట్ ఎక్కేసి ఇండియాకు చేరుకున్నాడు. అమృత్సర్లో తండ్రి గురించి వెతుకులాట ప్రారంభించాడు. భాష సమస్యలు ఎదుర్కొన్నాడు. కానీ, చివరకు తన తండ్రి జాడను తెలుసుకున్నాడు.
ఇంటి ముందు తండ్రీ, కొడుకులు ఆలింగనం చేసి ఉద్వేగానికి గురైన క్షణాలు చుట్టూ ఉన్నవారిని కూడా కదలించాయి. సుఖ్పాల్ కుటుంబమంతా రిన్ను అంతే ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానించి తమలో కలుపుకుంది. సఖ్పాల్కు 9వ తరగతి చదువుకున్న కూతురు అవిలీనా ఉన్నది. తనకు అన్నయ్య లేడనే లోటు తీరిందని అవిలీనా చెప్పగా, సుఖ్పాల్ భార్య.. రిన్ను దగ్గరకు తీసుకుంది. రాఖీ పండుగ రోజే వీరు కలవడం.. అన్న రిన్కు అవిలీనా రాఖీ కట్టడం బహుశా ఆ కుటుంబం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.
Also Read: MLC Kavitha: కవిత.. ఆవేశం తగ్గించుకో: బీజేపీ నేత
‘జపాన్లో నేను ఒక్కడినే. సోదరులు లేరు. ఉంటే బాగుండేదని అనుకునేవాడిని. ఇప్పుడు నాకు తండ్రితోపాటు కుటుంబమే ఉన్నది. చెల్లి కూడా ఉన్నది. నాన్నతో కలిసి దర్బార్ సాహిబాకు వెళ్లాను. తండ్రిని కలిపినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాను’ అని రిన్ సంతోషంగా చెప్పాడు.
ఇక లయన్ సినిమా విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్ ఖాండ్వాలో బొగ్గు దొంగతనం చేసే షేరూ(సింహం) ఓ రోజు వెంట వచ్చిన అన్న కోసం వెతికి అలసి ఓ కంపార్ట్మెంట్లో పడుకోగా.. లేచి చూసేసరికి అది కోల్కతా చేరుకుంటుంది. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు చెందిన దంపతులు ఐదేళ్ల షేరూను దత్తత తీసుకుంటుంది. వారి వద్దే పెరిగి పెద్దవుతాడు. కానీ, తన కుటుంబం ఎప్పుడూ గుర్తుకు వస్తుంది. అన్నతో కలిసి తిరిగిన ప్రాంతాలు, రైల్వే స్టేషన్, ఆ కొండలు, దారులు నిత్యం వెంటాడుతుంటాయి. అర్ధరాత్రిళ్లు లేచి తను కోల్పోయిన తన కుటుంబం పలవరింతలు సాధారమైపోతాయి. చిన్నప్పుడే తప్పిపోవడంతో ఉంటున్న ఏరియా తప్ప మరేమీ తెలియక సతమతం అవుతాడు. ఓ ఫ్రెండ్ సూచనతో గూగుల్ ఎర్త్లో నిత్యం తాను చూసిన కొండలు, ప్రాంతాలు, దారులను, రైల్వే స్టేషన్ను వెతుకుతూ పోల్చుకుంటూ గడుపుతుంటాడు. ఓ రోజు ఆ ప్రాంతాన్ని పోల్చుకుని స్వస్థలానికి చేరుకుంటాడు. చిన్న గుడిసెలో 25 ఏళ్లుగా కొడుకు కోసం ఎదురుచూసే తన తల్లిని కలుసుకుని కన్నీటిపర్యంతమవుతాడు. తాను తప్పిపోయిన రోజే అన్న ట్రైన్ యాక్సిడెంట్లో మరణించాడని తెలుసుకుని విలవిల్లాడిపోతాడు. మనిషిని తన గతం, తన మూలం ఎంతలా ప్రభావితం చేస్తుందో ఈ సినిమా కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.