Woman Tv Journalist’s body recovered from lake: ఓ టీవీ ఛానెల్ లో పనిచేసే మహిళా జర్నలిస్ట్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. స్థానిక చెరువులో ఆమె మృతదేహలం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే, ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆందోళన ఎదురవుతుంది. ఆత్మహత్యనా లేక హత్యనా అనేది తేల్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల్లో వచ్చిన కథనాల ప్రకారం వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ లోని ఓ టీవీ ఛానెల్ కు చెందిన జర్నలిస్ట్ రహ్మునా సారా మృతదేహం చెరువులో లభ్యమైంది. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెది ఆత్మహత్యనా లేక హత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. సారా ఆఫీసుకు వెళ్లినంక ఆ తరువాత ఇంటికి తిరిగి రాలేదని ఆమె భర్త పేర్కొన్నారు. అయితే, సారా చెరువులో దూకిందంటూ తమకు తెల్లవారుజామున 3 గంటలకు సమాచారం వచ్చిందని వెల్లడించారు.
కాగా, తన మరణానికి ముందు అనగా మంగళవారం రాత్రి రహ్మునా తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దేవుడు నిన్ను ఎప్పటికీ చల్లగా చూస్తాడని భావిస్తున్నాను. త్వరలోనే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటావని నేను బలంగా ఆశిస్తున్నాను. మనం మన జీవితం కోసం ఎన్నో పథకాలు వేసుకున్నాం. కానీ, వాటిని నెరవేర్చలేకపోతున్నందుకు నన్ను క్షమించు.. ప్లీజ్’ అంటూ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే మరో పోస్ట్ లో ‘చావుతో సమానమైన జీవితాన్ని గడపడం కంటే మృతిచెందడం ఉత్తమమం’ అంటూ అందులో ఆవేదనను వ్యక్తం చేసింది.
Also Read: కెనెడాలో దేశవ్యాప్తంగా భారీ నిరసనలు.. భయం గుప్పిట్లో 70 వేల విదేశీ విద్యార్థులు!
ఈ ఘటనపై బంగ్లాదేశ్ మాజీ పీఎం షేక్ హసీనా కొడుకు సజీబ్ వాజెద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘మహిళా జర్నలిస్ట్ మృతి భావప్రకటనా స్వేచ్ఛపై జరిగిన మరో క్రూరమైనటువంటి దాడి. ఇటీవలే అరెస్ట్ అయిన దస్తగిర్ గాజీకి చెందిన సెక్యూలర్ మీడియా హౌస్ ఛానల్ లో సారా పని చేస్తున్నది’ అంటూ అతను ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ లో ఇటీవలే తీవ్ర ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘర్షణల నేపథ్యంలో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం హసీనా భారత్ లోనే ఉన్నారు. కాగా, హసీనా ప్రభుత్వం రద్దవ్వడంతో అక్కడ మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యింది.
తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన తరువాత హసీనా ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను, అదేవిధంగా ప్రభుత్వానికి సహాయం చేసినటువంటివారిపై ఆందోళనకారులు దాడులు చేశారు. ఈ క్రమంలో వారు దేశం దాటి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో బంగ్లాదేశ్ సైనికులు వారిని అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్ట్ దంపతులు ఫర్జానా రూపా, ఆమె భర్త షకీల్ అహ్మద్ లను కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.