Director Vamsi Krishna: టాలీవుడ్ డైరెక్టర్ వంశీకృష్ణ ఒక ఇంటివాడయ్యాడు. నేడు వంశీకృష్ణ వివాహం ఘనంగా జరిగింది. ప్రమీల అనే యువతితో ఆయన పెళ్లి .. ఇరు కుటుంబ పెద్దలు, అత్యంత సన్నహితుల మధ్య గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరి వివాహానికి అభిషేక్ అగర్వాల్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇక వంశీకృష్ణ కెరీర్ గురించి చెప్పాలంటే.. 2015 లో అడివి శేష్, మంచు లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన దొంగాట సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. ఇక రెండేళ్ల గ్యాప్ తరువాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజ్ తరుణ్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను అందుకున్నా.. డైరెక్టర్ గా వంశీని నిలబెట్టలేకపోయింది.
ఇక వంశీ లక్ మార్చిన సినిమా అంటే టైగర్ నాగేశ్వరరావు. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరావు బయోపిక్ గా ఈ సినిమాను వంశీ తెరకెక్కించాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో రీసెర్చ్ చేసినట్లు ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. అయితే ఈ చిత్రం కూడా వంశీకి విజయాన్ని అందించలేకపోయింది.
రవితేజ లుక్, టేకింగ్, రేణు దేశాయ్ రీఎంట్రీ ఇచ్చినా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కొన్ని కొన్ని సీన్స్ అసలు నిజం కాదు అని ప్రేక్షకులు అనుమానాలను వ్యక్తం చేశారు. ఆ సినిమా తరువాత వంశీ ఇదుగో ఇప్పుడు ఇలా పెళ్లి కొడుకులా కనిపించాడు. ప్రస్తుతం వంశీ మంచి కథలను రాసే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. మరి ముందు ముందు ఈ డైరెక్టర్ ఏ హీరోలను మెప్పించి హిట్ అందుకుంటాడో చూడాలి.