– జైలు నుంచి బయటకొచ్చాక భాష సరిగ్గా లేదు
– ఆవేశం తగ్గించుకుంటే మంచిది
– ఛాలెంజ్ చేసిన తీరు తమిళనాడు శశికళను తలపించింది
– బీఆర్ఎస్పై ప్రతీకారం తీర్చుకోవాలంటే యాక్షన్ వేరేలా ఉంటుంది
– అయినా కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం మాకేంటి?
– నిజంగా ఇబ్బంది పెట్టాలనుకుంటే కేసీఆరే అరెస్ట్ అయ్యేవారు
– కవిత వ్యాఖ్యలపై బీజేపీ నేత టీజీ వెంకటేష్ ఆగ్రహం
– హైడ్రా కూల్చివేతలపై ప్రశంసలు
BJP: చాలా రోజుల జైలు జీవితం తర్వాత బయటకొచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబసభ్యులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. అయితే, మీడియాతో మాట్లాడుతూ, తనను ఈ స్థితికి తీసుకొచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనని హెచ్చరించారు. బీజేపీని ఉద్దేశించే కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ స్పందించారు.
కవిత ఆవేశం తగ్గించుకుంటే బెటర్
ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన భాష కరెక్ట్గా లేదన్నారు టీజీ వెంకటేష్. ఆమె ఆవేశం తగ్గించుకోవాలని హితవు పలికారు. గతంలో తమిళనాడులో శశికళ ఇలా ప్రతిజ్ఞలు చేశారని, కవిత కూడా అలాగే ప్రవర్తిస్తున్నారని సెటైర్లు వేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందని, అందుకే దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశారని చెప్పారు. పగ సాధించాలనుకుంటే, కేసీఆర్, కేటీఆర్ను అరెస్ట్ అయ్యేవారు కానీ, కవితను ఎందుకు చేస్తామని ప్రశ్నించారు. ఇప్పుడు వచ్చింది బెయిల్ మాత్రమేనని, కేసు కొట్టేయలేదన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై స్పందిస్తూ, అందులో వాస్తవం లేదని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి సూపర్
తెలంగాణలో అక్రమ కట్టడాలను సీఎం రేవంత్ రెడ్డి కూల్చేయడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు టీజీ వెంకటేష్. అక్రమ నిర్మాణాలను కూల్చే సమయంలో తన సలహాలను ఆయన తీసుకున్నారని, చెరువుల్లో నిర్మాణాలు చేసిన ఏ ఒక్కరిని రేవంత్ రెడ్డి వదలడం లేదని కొనియాడారు. ఎపీలో కూడా చెరువులు, రోడ్లు, పార్కులు, క్రీడా మైదానాల స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, వాటిని కూడా కూల్చాల్సి ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. లేదంటే భవిష్యత్తులో నీళ్ల సమస్య తీవ్రతరం అవుతుందని చెప్పారు.
టీటీడీ ప్రక్షాళన
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన మొదలైందన్నారు టీజీ వెంకటేష్. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మార్పులు కనిపిస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని, ఏపీకి కొత్త పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు.