EX Minister RK Roja Saying Good Bye To YS Jagan Mohan Reddy: రోజారెడ్డి ఇక పూర్తిస్థాయిలో రోజా సెల్వమణిగా క్యారెక్టర్ మార్చబోతున్నారా? తమిళంలో మంచి హిట్ సినిమాలు తీసి అక్కడ జనంలో గుర్తింపు తెచ్చుకున్న భర్త, సెల్వమణి ఇమేజ్తో పాటు తనకు అక్కడున్న అంతో ఇంతో ఫాలోయింగ్ను వాడుకుని తమిళ పాలిటిక్స్లో ఎంట్రీ ఇవ్వడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? వైసీపీతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? తన సోషల్ మీడియా ఫ్రొఫైల్స్లో జగన్తో పాటు పార్టీ ఆనవాళ్లను అందుకే చెరిపేశారా? అసలు ఆర్కే రోజా సెల్వమణి పొలిటికల్ ఫ్యూచర్పై వినిపిస్తున్న టాక్ ఏంటి?
ఆంధ్రప్రదేశ్లో అత్యంత వివాదాస్పదమైన పొలిటీషియన్ల లిస్ట్ తీస్తే ముందు వరుస కనిపిస్తారు మాజీ మంత్రి, నగర మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజారెడ్డి ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యారు రోజా.. 1991లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోజా తెలుగుతో పాటు కన్నడం, తమిళం, మలయాళం బాషల్లో 100కిపైగా సినిమాల్లో నటించారు. తనను తమిళ పరిశ్రమకు పరిచయం చేసిన అప్పటి హిట్ డైరెక్టర్ సెల్వమణినే వివాహం చేసుకుని.. హీరోయిన్గా రిటైర్ అయిన ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
టీడీపీతో పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన రోజా 2004, 2009 ఎన్నికల్లో నగరి, చంద్రగిరి సెగ్మెంట్ల నుంచి పోటీ చేసి రెండు సార్లూ ఓడిపోయారు. ఆమె పార్టీలో చేరగానే జరిగిన రెండు ఎన్నికల్లో టీడీపీ కూడా అధికారానికి దూరమైంది. 2009లో ఓటమి తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ఆశీస్సులతో కాంగ్రెస్లో చేరిపోయారు. ఆమె చేరిన కొద్ది నెలలకే వైఎస్ మరణించారు. ఆ తర్వాత పరిణామాలతో ఆమె జగన్ బాట పట్టి వైసీపీలో ఒక వెలుగువెలిగారు .. అప్పటికే పొలిటికల్ ఐరన్ లెగ్ అని ముద్ర వేయించుకున్న రోజాకి 2014లో పొలిటికల్ సక్సెస్ దొరికింది.
ఆ ఎన్నికల్లో నగరి వైసీపీ ఎమ్మెల్యేగా రోజా గెలిచినప్పటికీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాలేదు. దాంతో ఐరన్ లెగ్ బ్రాండ్ కంటిన్యూ అయింది. అప్పటి నుంచే రోజా నోటి దురుసు కూడా పెరిగిపోయింది టీడీపీ, జనసేన ముఖ్యనేతల్ని ఏకవచనంతో తిట్టడం.. ఎవరన్నా జగన్ని విమర్శిస్తే ఒంటికాలితో విరుచుకుపడటం కామన్ అయింది. 2019లో గెలిచి మంత్రి అయ్యాక రోజా నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి.
గత ఎన్నికల్లో ఎంతో కాన్ఫిడెంట్గా తాము గెలుస్తామని తమకు తిరుగే లేదని రోజా ధీమాగా కనిపించారు. జగన్పై ఏ విమర్శలు వచ్చినా టక్కున స్పందిస్తూ.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ. ప్రత్యర్ధులకు మేసేజ్లు, వీడియోల రూపంలో కౌంటర్ ఇచ్చేవారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత. నియోజకవర్గానికి మోహం చాటేసిన రోజా.. ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. మొన్నామధ్య ఆమె విదేశాల్లో ఫ్యాన్సీ డ్రస్ వేసుకున్న ఫొటో ఒకటి సోషల్మీడియాలో హల్చల్ చేసింది. ఇప్పుడు చూస్తే ఆమెతన సోషల్ మీడియా ప్రొఫైల్ నుంచి, వైసీపీ గుర్తులను, జగన్ ఆనవాళ్లను చెరిపేశారు. దాంతో రోజా వైసీపీకి కూడా దూరం అవుతున్నారన్న చర్చ స్టార్ట్ అయింది.
సినీ నటి రోజాకు కొంత ఫోలోయింగ్ ఉందనే చెప్పాలి. ఆమె భర్త కూడా తమిళంలో మంచి హిట్ మూవీస్ ఇచ్చారు. దీంతో తన సినీ గ్లామర్తోపాటు.. తన భర్త సెల్వమణి తమిళనాడుకు చెందిన వారు కావడంతో తమిళనాడు రాజకీయాల్లో రాణిస్తానని రోజా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. రోజాకు తమిళ భాషపైనా మంచి పట్టుంది. దీంతో అక్కడి రాజకీయాల్లోకి ఏ పార్టీ నుంచి ఎంట్రీ ఇవ్వాలనే విషయంపై తన సన్నిహితులతో రోజా కొద్దికాలంగా చర్చలు జరుపుతున్నారంట .. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది. అవకాశాన్ని బట్టి డీఎంకే లేదా హీరో విజయ్ కొత్తగా పెట్టిన పార్టీలలో ఏదో ఒక పార్టీ నుంచి ఆమె తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమన్న పుకార్లు షికారు చేస్తున్నాయి.
Also Read: మోపిదేవి కంటే ముందే షాకిచ్చిన ఎమ్మెల్సీ.. వైసీపీకి రాజీనామా
అయితే రోజా దూకుడు కారణంగా ఆమె ఏ పార్టీలో అట్టే కాలం ఇమడలేరంటున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి అయ్యాక ఆమె నగరి వైసీపీ శ్రేణులను పట్టించుకోకుండా.. తన అన్నలతో కలిసి నియోజకవర్గంలో దందాలు నడిపించి. గట్టిగా వెనకేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. మంత్రి అయిన కొద్దినెలలకే రోజా ఖరీదైన కారును కొనుగోలు చేయడం కూడా అప్పట్లో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో నగరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు, క్యాడర్ నుంచి రోజా పట్ల వ్యతిరేకత పెల్లుబికింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ నియోజకవర్గంలోని ముఖ్యనేతలంతా ఏకతాటిపైకి వచ్చి జగన్ కు ఫిర్యాదు చేశారు.
రోజా నోటి దూకుడుతో మహిళా ఓటర్లు వైసీపీకి దూరమయ్యారని వైసీపీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారంటున్నారు. రోజాలాంటి మహిళ పార్టీ నుంచి వెళ్లిపోవటమే మంచిదన్న భావనకు అధిష్టానం సైతం వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం తనపట్ల విముఖత చూపుతుందనే విషయాన్ని ముందుగానే గమనించిన రోజా.. తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారన్న టాక్ నడుస్తోంది.
ఇటు చూస్తే ఏపీలో ఏ పార్టీ రోజాని చేర్చుకునే పరిస్థితి లేదు. వైసీపీ ఐదేళ్ల పాలనలో బీజేపీ, తెలుగుదేశం, జనసేనలతో పాట కాంగ్రెస్ పార్టీ నేతలపై కూడా రోజా తీవ్రస్థాయిలో విమ్శలు చేశారు. దాంతో ఆమెకు రాష్ట్రంలో పొలిటికల్ ప్లాట్ఫాం లేకుండా పోయింది .. ఓటమి తర్వాత అసలు ఆ జబర్దస్త్ మాజీ యాంకర్ జనానికి ముఖం చూపించలేకపోతున్నారు .. అందుకే తమిళ పాలిటిక్స్ వైపు చూస్తున్నారని.. అక్కడ కూడా ఆమె మనుగడ అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ఒక సందర్భంలో చంద్రబాబు తనకు మంచి స్నేహితుడని చెప్పిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ను రోజా తన స్టైల్లో టార్గెట్ చేశారు. దాంతో రజనీని దేవుడిలా కొలిచే ఆ రాష్ట్రంలో ఆమె పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సరే ఎలాగోలా ఆమె అక్కడ రాజకీయ ఎంట్రీ ఇచ్చి రాణిద్దామనుకున్నా.. ఏపీలో ఆమె మంత్రిగా పాల్పడినట్లు వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణలో దోషిగా తేలితే ఇక ఆమె రాజకీయ జీవితం ముగిసినట్లే.
ఆ ఆరోపణల కారణంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రోజా ఏపీలో పెద్దగా కనిపించడం లేదు. పర్యాటక శాఖ మంత్రిగా ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో ఆమె కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ చేసినట్లు కేసులు నమోదవుతున్నాయి. సదరు క్రీడల నిర్వహణలో వంద కోట్ల రూపాయల స్కాం జరిగిందని గత కొంతకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. దానిపై విచారణ కూడా జరుగుతోందంటున్నారు. ప్రభుత్వ విచారణలో రోజాపై ఆరోపణలు నిజమేనని తేలితే ఆమె కటకటాల పాలుకావడం ఖాయమన్న చర్చ జరుగుతుంది. ఏదేమైనా ఇప్పుడు వైసీపీకి దూరం జరగాలని ఫిక్స్ అయినట్లే కనిపిస్తున్నారు. అందుకే తన సోషల్ మీడియా ప్రొఫైల్స్లో తన జగనన్న ఫొటో తీసేశారు. మరి చూడాలి ఆమె ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో.