Janwada Farmhouse: రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ వద్ద అధికారులు బుధవారం మరోసారి సర్వే నిర్వహిస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా ఈ సర్వేను చేపట్టారు. మొత్తం ఆరుగురు సభ్యులు బృందం.. నక్ష, డీజీపీఎస్ యంత్రాలతో సర్వే చేస్తున్నారు.
అయితే, జన్వాడ ఫామ్ హౌస్ పక్క నుంచి ఫిరంగి నాలా ప్రవహిస్తుంటది. కాగా, ఈ నాలాలోనే ఫామ్ హౌస్ ప్రహరీగోడ, గేటు నిర్మించారంటూ భారీగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అధికారులు మంగళవారం కూడా సర్వే నిర్వహించారు. నేడు మరోసారి కూడా అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలిసి ప్రజలు .. జన్వాడ ఫామ్ హౌస్ పై వస్తున్న ఆరోపణలు నిజమేనా..? అధికారుల సర్వేలో ఏం తేలిందంటూ తెలుసుకునేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. జన్వాడ ఫాంహౌస్ మొదటి నుంచి వివాదాల్లో ఉంది. 111 జీవో పరిధిలో, బఫర్ జోన్లో, బుల్కాపూర్ నాలాని ఆక్రమించి కట్టారంటూ వివాదం తారస్థాయికి చేరుకుంది. అయితే, ఆ ఫౌంహౌస్తో తనకు సంబంధం లేదని, లీజుకు మాత్రమే తీసుకున్నానంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో అక్కడి ఆక్రమణలపై అందరిలో ఆసక్తి పెరిగింది. 2020లో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేసి రిపోర్ట్ తయారు చేశారు. ఆ సమయంలో కేటీఆర్ ఆ ఫాంహౌస్ను వాడుతుండడం, పురపాలక మంత్రి కావడం, సీఎం కుమారుడు కావడంతో చర్యలు తీసుకునేందుకు అధికారులకు ధైర్యం చూపలేదు. ఆ రిపోర్టును కూడా తొక్కిపెట్టారనే ఆరోపణలున్నాయి. ఎన్జీటీ ఎంటరైనా అధికార బలంతో మేనేజ్ చేశారనే విమర్శలున్నాయి. జన్వాడ ఫాంహౌస్ దగ్గర ఇప్పుడు మళ్లీ అధికారులు సర్వే చేయడంతో పాత విషయాలన్నీ వెలుగుచూస్తున్నాయి.
గండిపేట జలాశయానికి కూతవేటు దూరంలో ఉంటుంది జన్వాడ గ్రామం. జలాశయానికి వచ్చే వరదను కంట్రోల్ చేయడానికి, నీటిని దారి మళ్లించడానికి కాలువ ఉంది. ఇది మోకిల, బుల్కాపూర్, జన్వాడ మీదుగా, మణికొండకు లింక్ అవుతుంది. అటు నుంచి కోకాపేట, నార్సింగ్, షేక్ పేట, హకీంపేట, ఖైరతాబాద్ మీదుగా హుస్సేన్ సాగర్లో కలుస్తుంది. దాదాపు 24 కిలోమీటర్లు ఉండే ఈ కాలువకు లింక్ ఉన్న బుల్కాపూర్ (ఫిరంగి) నాలా ఫాంహౌస్కు చాలా దగ్గర నుంచి వెళ్తుంది. దీన్ని ఆక్రమించి ఫాంహౌస్ ప్రహరీ నిర్మించారనేది అధికారుల వాదన. నాలాకు 9 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంది.
కాగా, నాలా గతంలో 50 మీటర్ల వరకు ఉండేది. కానీ, ఇప్పుడు 18 నుంచి 20 మీటర్లకు తగ్గిపోయింది. ముఖ్యంగా బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టకూడదని తెలిసినా ప్రహరీ కట్టి గేటు ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై గతంలోనే సర్వే చేసినా, అధికారంలో ఉండడంతో మేనేజ్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో, ఆక్రమణలపై హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుండడంతో జన్వాడ ఫాంహౌస్ రహస్యాలు బయటకు వస్తున్నాయి. అధికారులు జరుపుతున్న సర్వేను బట్టి, హైడ్రా యాక్షన్ ప్లాన్ ఉంటుందని చెబుతున్నారు.