Naga Chaitanya: అక్కినేని నాగార్జున N కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసిన విషయం తెల్సిందే. ఇక దీంతో గత కొన్నిరోజులుగా నాగార్జున పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ కూల్చివేతపై ఇప్పటికే నాగార్జున స్పందించిన విషయం తెల్సిందే. అక్రమంగా తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి N కన్వెన్షన్ ను కట్టినట్లు వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని, ఆ భూమి అంతా పట్టా భూమి అని చెప్పుకొచ్చాడు.
” N-కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి . కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని Special Court, AP Land Grabbing (Prohibition) Act, 24-02-2014న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం , నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం గౌరవ హైకోర్టుని ఆశ్రయించటం జరిగింది. న్యాయస్థానం తీర్పు కి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్ధిస్తున్నాను ” అంటూ నాగ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
ఇక ఈ ఘటన తరువాత అసలు నాగ్ ఆస్తుల విలువ ఎంత.. ? N కన్వెన్షన్ ద్వారా నాగ్ వచ్చే ఆదాయం ఎంత.. ? అని ఆరాలు తీయడం మొదలుపెడుతున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా నాగ చైతన్య సైతం ఈ ఘటనపై స్పందించాడు. నిన్న ఒక క్లాత్ షోరూమ్ ఓపెనింగ్ కు వెళ్లిన చైకు N కన్వెన్షన్ కూల్చివేతపై ప్రశ్న ఎదురయ్యింది.
ఇక దానికి చై మాట్లాడుతూ.. ” ఈ సమయంలో దాని గురించి ఎందుకు.. అయినా దానికి సంబంధించిన నిజాలను నాన్న ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇంతకు మించి ఇక్కడ ఆ టాపిక్ మాట్లాడడం బాగోదని” చై చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి నాగ్.. N కన్వెన్షన్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సిందే.