Kolkata Rape Case: కోల్కతా హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కోల్కత వీధుల్లో విద్యార్థులు, సాధారణ ప్రజలు, వైద్యులు అంతా రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. ఈ ఘటనపై అందరూ దిగ్భ్రాంతి చేశారు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తన ఆందోళనను వ్యక్తపరిచారు. ఈ ఘటనతో తాను దిగులుపడ్డానని, ఆందోళన చెందానని తెలిపారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించింది ఇక చాలు అని పేర్కొన్నారు.
మన సమాజం ఈ ఘటనపై నిష్పక్షపాతంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉన్నదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. ‘ఏ నాగరిక సమాజమైనా అక్కా చెల్లెళ్లు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలను అంగీకరించదు. విద్యార్థులు సహా సాధారణ నాగరికులు, వైద్యులు కోల్కతాలో ధర్నా చేస్తున్నారు. కానీ, దురదృష్టవశాత్తు క్రిమినల్స్ మాత్రం మరెక్కడో అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు.
మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను వ్యతిరేకించాల్సిన అవరసరం ఉన్నదని, భారత సమాజం మేలుకుని జాగరూకతగా వ్యవహరించాలని రాష్ట్రపతి సూచించారు. మహిళలు బలహీనులని, అసమర్థులని, తెలివిలేనివారనే మైండ్సెట్కు సమాజం కౌంటర్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవారు.. మరింత ముందుకెళ్లి మహిళలను ఒక వస్తువుగా చూసే ముప్పు ఉంటుందన్నారు. ఈ భయం నుంచి విముక్తి పొందే మార్గంలో ఆడబిడ్డలకు వచ్చే అడ్డంకులను తొలగించాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని వివరించారు.
Also Read: Mopidevi: జగన్కు ఝలక్? రేపో మాపో టీడీపీ గూటికి మోపిదేవి, ఎందుకంటే..
ఆర్జి కర్ హాస్పిటల్లో ఆగస్టు 9వ తేదీన జూనియర్ డాక్టర్ పై దారుణమైన అఘాయిత్యం జరిగింది. ఈ ఘటన తర్వాత కోల్కతా పోలీసు సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్టు చేశారు.
వైద్యులపై అఘాయిత్యాలు జరుగుతున్న తరుణంలో సుప్రీంకోర్టు ఇటీవలే కీలక సూచనలు చేసింది. వైద్యులకు పని ప్రదేశంలో భద్రత గురించి కొన్ని గైడ్లైన్స్ విడుదల చేసింది. వీటిపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ ప్రధాన కార్యదర్శులకు, డీజీలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఓ లేఖ బుధవారం రాశారు.
– వైద్య సిబ్బంది రక్షణ కోసం రూపొందించిన చట్టాలను ఆస్పత్రి ప్రాంగణంలో ప్రదర్శించాలి. వారిపై దాడులకు పాల్పడితే విధించే శిక్షలను వివరిస్తూ ఆంగ్ల భాషతోపాటు స్థానిక భాషల్లోనూ నోటీసులు అంటించాలి.
– ఇలాంటి ఘటనలను కంట్రోల్ చేయడానికి అవసరమైన చర్యలు రూపొందించడానికి సీనియర్ వైద్యులు, పాలనాధికారులతో కమిటీలు వేయాలి.
– విజిటర్ పాస్ పాలసీని కఠినతరం చేయాలి. హాస్పిటల్లోని కీలక ప్రదేశల్లో సాధారణ ప్రజలు, రోగుల బంధువుల కదలికలకు సంబంధించి అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలి.
– నైట్ షిఫ్ట్లలో క్యాంపస్లోని ఒక ప్రదేశం నుంచి మరో చోటుకు రెసిడెంట్ డాక్టర్లను సురక్షితంగా తరలించే సదుపాయాలు ఏర్పాటు చేయాలి.
– నైట్ షిఫ్ట్ల సమయంలో రోటీన్ పెట్రోలింగ్ నిర్వహించాలి.
– స్థానిక పోలీసు స్టేషన్కు హాస్పిటల్ను లింక్ చేయాలి.
– క్యాంపస్లోని ప్రతి మూలా సీసీటీవీ కెమెరాలు పని చేసేలా ఉండాలి. వాటిని పర్యవేక్షిస్తుండాలి.
– రాత్రిపూట హాస్పిటల్ క్యాంపస్ భవనాలు, హాస్పిటళ్లు అన్నింటిలో తగినంత వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.