Hyderabad becomes space tourism: మొన్నామధ్య (డిసెంబర్ 7న) హైదరాబాద్ వద్ద ఆకాశంలో ఓ వింత ఆకారం ఉందంటూ జనం హడావుడి చేశారు. అది ఏలియన్స్ ఫ్లయింగ్ సాసరేమోనని హైరానా పడ్డారు. ఆ తర్వాత ఆ ఆకారం కుప్ప కూలిందంటూ వార్తలు వచ్చాయి. నిజానికి అదేంటో తెలుసా! భారీ ప్లాస్టిక్ బెలూన్. అలాగని అదేదో ప్రచారం కోసం వదిలింది కాదు. స్పేస్ టూరిజం కోసం చేపట్టిన ప్రయోగం అది. స్పెయిన్ కు చెందిన హాలో స్పేస్ టూరిజం కంపెనీతో కలిసి చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ అయిందని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్ఆర్) సంస్థ ప్రకటించింది. అయితే ఇది కేవలం ప్రయోగం మాత్రమే… కానీ 2029 నాటికి హైదరాబాద్ పెద్ద స్పేస్ టూరిజం సెంటర్ గా ఎదగబోతోంది. ఇప్పటికే పర్యాటకపరంగా హైదరాబాద్ దేశ విదేశీ టూరిస్టులను ఆకర్షిస్తోంది. హాల్ స్పేస్ టూరిజం కూడా అందుబాటులోకి వస్తే విశ్వనగరంగా ఎదుగుతున్న భాగ్యనగరం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.
హాలో స్పేస్ టూరిజం అంటే ఏంటి?
భూమిపైన ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. అవి టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తాయి. అయితే ఇవన్నీ అందరికీ అందుబాటులో ఉంటాయి. కానీ సమ్ థింగ్ స్పెషల్ కోరుకుంటున్నవారు ఇప్పుడు ఆకాశం వైపు చూస్తున్నారు. ఇటీవలే ప్రపంచంలోని పలు స్పేస్ సంస్థలు స్పేస్ టూరిజంను డెవలప్ చేస్తున్నాయి. ఇటీవలే జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ వంటివారు కూడా తమ సొంత సంస్థలు రూపొందించిన స్పేస్ క్రాఫ్ట్స్ లలో ఆకాశంలోకి వెళ్లి వచ్చిన విషయం గుర్తిందికదా! హైదరాబాద్ లో చేపట్టబోయేది కూడా స్పేస్ టూరిజమే. కాకపోతే వాటికంటే భిన్నంగా ఉంటుంది. అక్కడ స్పేస్ క్రాఫ్ట్స్ లలో వెళ్లి భూమి అంచులను చూసి, భూగోళాన్ని చుట్టిరావచ్చు. కాసేపు భారరహిత స్థితిలో ఉండొచ్చు. కానీ హాలో స్పేస్ టూరిజంలో పెద్ద ప్లాస్టిక్ బెలూన్, క్యాప్సూల్ లో భూమి నుంచి 37 కిలోమీటర్ల ఎత్తులో నింగిలోకి వెళ్లొచ్చు. అక్కడ 40 నిమిషాలపాటు ఉండి భూమిపైకి రావచ్చు. అక్కడి నుంచి భూగోళం ఆకారాన్ని, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల అందాలను వీక్షించొచ్చు. వీటిలో ఒకేసారి 6 నుంచి 8 మంది స్పేస్ టూరిస్టులు స్ట్రాటోస్పియర్ వరకు వెళ్లి వచ్చేలా ప్రయోగాన్ని నిర్వహించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ ప్రయోగంలో భాగంగా 2.87 లక్షల క్యూబిక్ మీటర్ల పరిమాణం కలిగిన ప్లాస్టిక్ బెలూన్ ని దాదాపు 620 కిలోల బరువైన మానవరహిత క్యాప్సూల్ తో నింగిలోకి పంపినట్లు టీఐఎఫ్ఆర్ తెలిపింది.
టూరిస్టులకు ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది?
2016లో ఏర్పాటైన హాలో స్పేస్ సంస్థ పలు ప్రయోగాలు చేపట్టింది. 2029 నాటికి స్పెయిన్ తో సహా పలు దేశాల నుంచి బెలూన్ ఫ్లైట్ సేవలను ప్రారంభించాలని టార్గెట్ గా పెట్టుకుంది. గరిష్టంగా 40 కిలోమీటర్ల ఎత్తు నుంచి భూగోళం అందాలను చూసేలా ప్లాన్ చేస్తోంది. 2029 నాటికి కమర్షియల్ సేవలు అందుబాటులోకి తేనుంది. అయితే స్పేస్ లోకి వెళ్లాలని ఉన్నా… అది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే దీని ఒక ట్రిప్ టికెట్ ఛార్జ్ రూ.1.64 కోట్లు (1 కోటి 64 లక్షలు). అయితే భవిష్యత్తులో పోటీపెరిగితే మాత్రం టికెట్ ధర భారీగా తగ్గే అవకాశం ఉంటుంది.