Movie Writer Nadiminti Narasinga Rao Passes Away: టాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ రచయిత నడిమింటి నరసింగరావు(72) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మరింత విషమించడంతో బుధవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే వారం రోజులు క్రితమే ఆయన కోమాలోకి వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘గులాబీ, వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘అనగనగా ఒకరోజు’ వంటి సినిమాలకు రచయితగా పనిచేశారు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దీంతో పాటు పాతబస్తీ, ఊరికి మొనగాడు, కుచ్చికుచ్చి కూనమ్మా వంటి చిత్రాలు మాటలు రాశారు.
సినిమాలోకి రాక ముందు బొమ్మలాట అనే నాటకం ద్వారా మంచి గుర్తింపు పొందాడు. దీంతోపాటు దూరదర్శన్ లో వచ్చే తెనాలి రామకృష్ణ సీరియల్ కి సైతం ఆయనే రచయితగా చేశారు. ఈ సీరియల్ అప్పట్లో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. అదే విధంగా వండర్ బోయ్, లేడీ డిటెక్టివ్, అంతరంగాలు వంటి పాపులర్ సీరియల్స్ కి మాటలు అందించారు. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సినిమా ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.