Congress: ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం. రాజశ్యామల, నవచండీ యాగాలు నిర్వహించిన కేసీఆర్. మామూలుగా అయితే ఎట్టుండాలె. పొద్దున్నుంచే టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ లు, నాన్ స్టాప్ లైవ్ కవరేజ్ లతో ఫుల్ హడావుడి ఉండాలె. కార్యక్రమానికి వచ్చిన పార్టీల నేతలు, అతిథులతో మాట్లాడించడం.. గ్రాఫిక్స్ ప్రజెంటేషన్లతో రాష్ట్రమంతా బీఆర్ఎస్ న్యూసే మారుమోగిపోయేలా ఉండాలె. కానీ, సీన్ రివర్స్. ఈసారి అలా కాలె. సరిగ్గా, బీఆర్ఎస్ భవన్ ఓపెనింగ్ టైమ్ కే కాంగ్రెస్ హంగామా. అన్ని ఛానెల్స్ తోనూ కాంగ్రెస్ నిరసనల న్యూసే. ఢిల్లీలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశం. తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలు. ఇలా.. బీఆర్ఎస్, కేసీఆర్, యాగం న్యూస్ సెకండ్ ప్రయారిటీకి పడిపోయింది. కాంగ్రెస్సే మెయిన్ న్యూస్ గా మారింది.
టైమ్ చూసి కొట్టడమంటే ఇదే. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కరెక్ట్ టైమ్ లో కరెక్ట్ బాణం గురి చూసి వదిలారు. లక్ష్యాన్ని సాధించారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి కేసీఆర్ టాప్ ప్రయారిటీ ఇచ్చారు. కొన్ని రోజులుగా భారీ ఏర్పాట్లు చేశారు. అంతా చేస్తే.. ఓపెనింగ్ రోజున మీడియా కవరేజ్ సరిగ్గా లేకుండా పోయింది. అంతా కాంగ్రెస్ కహానీలే. హైదరాబాద్ లో కాంగ్రెస్ స్టాటజిస్ట్ సునీల్ కనుగోలు ఆఫీసుపై పోలీసులు దాడి చేయడం, కంప్యూటర్లు తీసుకెళ్లడాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. బీఆర్ఎస్ ఈవెంట్ కు ముందురోజే ఇలా జరగడంతో రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. గంటల వ్యవధిలో స్పందించారు. బుధవారం అటు ఢిల్లీలో, ఇటు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చారు.
రేవంత్ రెడ్డి పిలుపుతో.. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యాలయాలను ముట్టడించారు. హైదరాబాద్ గాంధీభవన్ దగ్గర నిరసన తెలిపి, ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఇక, ఢిల్లీలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సైతం బీఆర్ఎస్ కార్యాలయ ముట్టడికి ముందుకు కదిలారు. పోలీసులు అడ్డుకోవడం.. ఉద్రిక్తత తలెత్తడంతో.. అవన్నీ బ్రేకింగ్ న్యూస్ లుగా మారాయి.
ఇలా రోజంగా కాంగ్రెస్ నిరసనలే హైలైట్ అయ్యాయి. బీఆర్ఎస్ విషయం సైడ్ ట్రాక్ అయింది. ఇలా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న పీసీసీ చీఫ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఇన్నాళ్లూ బీజేపీ హడావుడే చూశారని.. ఇకపై కాంగ్రెస్ సత్తా కూడా చూసేందుకు రెడీగా ఉండండి అనేలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారని అంటున్నారు.