Joe Root out from ENG vs AUS Matches: క్రికెట్ లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలీదని అందరూ అంటూ ఉంటారు. నిజమే, గ్రౌండులోకి వెళ్లిన తర్వాత గెలిచే మ్యాచ్ లు ఓడిపోవచ్చు, ఓడిపోయే మ్యాచ్ లు గెలిచే అవకాశాలు రావచ్చు.. అయితే నేటి కాలంలో ఆటగాళ్ల కెరీర్ కూడా అలాగే మారిందని, ఎప్పుడెవరికి ఎలా మూడుతుందో తెలీడం లేదని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే.. ఇంగ్లండ్ క్రికెట్ లో ఒక వెలుగు వెలిగి 48 సెంచరీలు, 19వేల పరుగులు చేసిన గ్రేట్ క్రికెటర్ జో రూట్ని ఆస్ట్రేలియాతో జరిగే టీ 20, వన్డే సిరీస్ లకు ఎంపిక చేయలేదు. అలాంటి మేటి క్రికెటర్ ను తప్పించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇంగ్లండ్ బోర్డుని అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్, 33 ఏళ్ల జో రూట్.. ప్రస్తుతం టెస్టు ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 347 మ్యాచ్లు ఆడి 19,546 పరుగులు చేశాడు. ఇందులో 48 సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 171 మ్యాచుల్లో 6,522 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాంటి జో రూట్ ను టీ 20, వన్డే మ్యాచ్ లకు తప్పించడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 33 ఏళ్లు వచ్చేశాయని పక్కన పెట్టారని కామెంట్లు చేస్తున్నారు.
Also Read: పాకిస్థాన్లో ఆడేందుకు ఇష్టం..టీమిండియా బౌలర్
ఇంగ్లాండ్ ఇప్పుడు స్వదేశంలో శ్రీలంకతో మూడు మ్యాచ్ల టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఆడుతోంది. ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో ఉంది. అనంతరం సెప్టెంబర్ 11 నుంచి ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్, ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ రెండు సిరీస్లకు తాజాగా ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. అందులో ప్రధానమైన ఆటగాళ్లు జో రూట్, జానీ బెయిర్ స్టో, మోయిన్ అలీ, క్రిస్ జోర్డాన్ లను ఎంపిక చేయలేదు.
వీరి స్థానంలో ఐదుగురు కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. వారు ఎవరంటే.. జోర్డాన్ కాక్స్, జాకబ్ బెథెల్, డాన్ మౌస్లీ, జోష్ హల్, జాన్ టర్నర్ ఉన్నారు. వీరందరూ ఒకేసారి ఇంగ్లాండ్ తరఫున ఆడే అవకాశం పొందారు. మరి ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్న ఇంగ్లండ్ ఎటువంటి ఫలితాన్ని పొందుతుందో వేచి చూడాల్సిందే.