Kuldeep Yadav excited to play in Pakistan: వన్డే క్రికెట్ చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరగనుంది. అయితే ఇప్పటికే ముసాయిదా షెడ్యూల్ను పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి సమర్పించింది.
ఇక, ప్లేయర్ల సెక్యూరిటీ, ఇతర కారణాల నేపథ్యంలో టీమిండియా చాలాకాలంగా పాక్ పర్యటనకు వెళ్లడం లేదు. దీంతో రానున్న వన్డే క్రికెట్ చాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్కు టీమిండియా వెళ్తుందా? లేదా? అనే సస్పెన్స్ అందరిలోనూ నెలకొంది.
ఈ తరుణంలో భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ అవకాశం వస్తే టీమిండియాతో కలిసి పాకిస్థాన్కు వెళ్లి అక్కడ ఆడతానని చెప్పాడు.
‘క్రికెటర్లుగా మమ్మల్ని ఎక్కడికి పంపినా వెళ్లి ఆడటానికి సిద్ధంగా ఉంటాం. అది మా బాధ్యత. ఇంతకు ముందెన్నడూ పాకిస్థాన్ కు వెళ్లి ఆడలేదు. ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా వెళ్లి ఆడతాను’ అని భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ చెప్పుకొచ్చాడు.