ICC: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సెక్రెటరీ జై షా మరో పదవిని స్వీకరించనున్నాడు. ఆయన హోదాను పెంచుకోనున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కు చైర్మన్గా ఆయన ఎన్నికయ్యాడు. ఏకంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆగస్టు 27వ తేదీన ఆయన ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో ఐసీసీ చైర్మన్గా ఏకగ్రీవమయ్యాడు. 35 ఏళ్ల వయసులోనే ఐసీసీ చైర్మన్ బాధ్యతలు అందుకోనున్న జై షా ఈ హోదాను పొందిన అతి పిన్నవయస్కుడిగా రికార్డు బ్రేక్ చేశాడు.
ఐసీసీ చైర్మన్ పదవి కోసం ఎవరూ నామినేషన్ వేయలేదు. చివరి రోజున జై షా నామినేషన్ వేశాడు. దీంతో ఆయనే ఐసీసీ చైర్మన్గా గెలిచినట్టయింది. ఐసీసీ చైర్మన్గా గ్రెగ్ బర్క్లీ సేవలు అందించాడు. 2020లో గ్రెగ్ బర్క్లీ ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు అందిపుచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా మరోసారి ఆయనే ఈ బాధ్యతలు కొనసాగించాడు. మూడోసారి ఐసీసీ చైర్మన్గా కొనసాగడానికి ఆయన నిరాకరించాడు. జై షా ఐసీసీ చైర్మన్గా ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తాడు.
ఒకరి కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేస్తేనే ఎన్నిక నిర్వహిస్తామని ఈ నెల మొదట్లోనే ఐసీసీ ప్రకటించింది. ఈ పదవికి కేవలం ఒక్క జై షా నే నామినేషన్ వేశారని మంగళవారం వెల్లడైంది. ఈ ఏడాది నవంబర్లో జై షా బీసీసీఐ సెక్రెటరీగా తప్పుకోనున్నారు. అప్పుడు బీసీసీఐకి కొత్త చీఫ్ ఎవరన్నది తెలుస్తుంది.
Also Read: Kavitha Stepped out from jail: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జైలు నుంచి విడుదలైన కవిత
అంతర్జాతీయంగా క్రికెట్కు ఆదరణ పెరుగుతున్న సమయంలోనే జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలికి చైర్మన్గా ఎన్నిక కావడం గమనార్హం. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ను కూడా చేర్చుకున్న విషయం తెలిసిందే. ఐసీసీ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫెయిర్స్ సబ్ కమిటీ చైర్పర్సన్గా గతంలో జై షా బాధ్యతలు నిర్వర్తించాడు. క్రికెట్ ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఈ సబ్ కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది.
ఐసీసీ చైర్మన్గా ఇది వరకు భారత్ నుంచి నలుగురు వ్యక్తులు సేవలు అందించారు. జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోనహర్లు గతంలో ఐసీసీకి నేతృత్వం వహించారు. ఇప్పుడు జై షా ఆ పని చేయనున్నాడు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ నుంచి జై షా వేగంగా ఎదుగుతూ వచ్చాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్గా ఆయన 2009లో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. జీసీఏ జాయింట్ సెక్రెటరీగా ఆయన 2013 సెప్టెంబర్లో ఎంపికయ్యాడు. అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియం అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఈ క్రికెట్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం కావడం గమనార్హం. అదే దూకుడు కొనసాగించిన జై షా మరో కీలక, ఉన్నత పదవిని త్వరలోనే అధిరోహించనున్నారు. ప్రపంచ క్రికెట్లో ఆయన ప్రముఖ పాత్ర పోషిస్తారని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.