Educational Institutions: ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న విద్యా సంస్థలకు హైడ్రా ఊరట ఇచ్చే నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థలపై ఈ దూకుడు ఉండదని, వాటికి కొంత సమయం ఇస్తామని తెలిపింది. అందులో చదువుకునే విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని వాటిని కూల్చివేయబోమని వివరించింది. అయితే, ముందస్తుగా నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. వాళ్లే వారి అక్రమ కట్టడాలను తొలగించాలని సూచించింది. లేదంటే తాము రంగంలోకి దిగుతామని స్పష్టం చేసింది.
ఒవైసీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డిలకు చెందిన విద్యా సంస్థలపై ఆరోపణలు వస్తున్నాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ, చంద్రాయాణగుట్టలోని సకలం చెరువు సమీపంలోని ఒవైసీ ఫాతిమా కాలేజీ, మల్లారెడ్డికి సంబంధించిన కొన్ని విద్యా సంస్థలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటిని కూడా హైడ్రా కూల్చేస్తుందన్న ప్రచారం సాగింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏకంగా హైకోర్టును ఆశ్రయించి రక్షణ కోరారు. కానీ, రూల్స్ అమలవుతాయని కోర్టు స్పష్టం చేసింది.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ నువ్వేమైనా పుడింగివా.. అసలు నీకు ఫ్యాన్స్ ఉన్నారా.. జనసేన ఎమ్మెల్యే ఫైర్
ఇలాంటి నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యాసంస్థల అక్రమ కట్టడాలను తొలగించడానికి సమయం ఇస్తామని వెల్లడించారు. ముందస్తు నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి వాటిని తరలించేందుకు సహకరిస్తామని వివరించారు. విద్యార్థుల భవిష్యత్ నష్టపోకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అకడమిక్ ఇయర్ మధ్యలో వాటిని కూల్చేస్తే అందులో చదివే విద్యార్థులు నష్టపోతారని తెలిపారు. విద్యార్థులు రోడ్డున పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు.
హైడ్రా రూల్స్ అందరికీ ఒకేలా వర్తిస్తాయని ఈ సందర్భంగా ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఒవైసీ అయినా, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి అయినా ఒకే రూల్ వర్తిస్తుందని వివరించారు. వాళ్లకు వాళ్లు తొలగించకపోతే తాము చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.