– దూకుడుగా ఉన్న హైడ్రాకు ‘స్వేచ్ఛ’ సవాల్
– మేఘా సంస్థను ఢీకొట్టే దమ్ముందా?
– నాగారంలో చెరువులు, రోడ్లు, పార్క్ ప్లేస్ కబ్జా!
– ఐకామ్ కంపెనీలో పెట్టుబడులతో ప్రభుత్వ భూములపై కన్ను
– ఆయుధాల తయారీ మాటున రెండు చెరువుల మాయం
– హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా ఇన్నాళ్లూ స్పందించని అధికారులు
– హైడ్రాకి ఆధారాలు ఇస్తాం.. కూల్చేస్తారా?
– మేఘా మెగా కబ్జాపై ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ స్టోరీ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ-బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం: చెరువులను చెరబట్టిన ఆక్రమణదారులకు చుక్కలు చేపిస్తోంది హైడ్రా. ప్రభుత్వ స్థలాలు ఎక్కడ కబ్జా అయినా జేసీబీతో వాలిపోతోంది. ఎప్పటికప్పుడు కూల్చివేతలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తూ, అంతా ప్రజల ముందు పెడుతోంది. అయితే, దేశంలోనే అత్యంత ప్రభావిత కంపెనీ అయిన మేఘా ఇంజినీరింగ్ సిస్టర్ సంస్థ ఐకామ్ టెలీ లిమిటెడ్ విచ్చలవిడిగా కబ్జాలకు పాల్పడింది. మేఘా పామిరెడ్డి డైరెక్టర్గా జాయిన్ అయిన తర్వాతనే జాలు బావి, మేడి బావి కుంటలు ధ్వంసమయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ ఛైర్మన్, కౌన్సెలర్స్ చెరువులను కాపాడాలని తీర్మానం చేసినా, ఇప్పటికీ కూల్చివేతలు జరగలేదు. హైకోర్టులో బీజేపీ నేత సత్తిరెడ్డి పిటిషన్ దాఖలు చేయగా, విచారణ తర్వాత ఉత్తర్వులు వచ్చినా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నది లేదు. కబ్జాలు జరిగింది వాస్తవం అంటూ అనేక ఉత్తరాలు, ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైన హైడ్రా ఈ వ్యవహారంపై పంజా విసురుతుందా? లేదా మేఘా కంపెనీ కాబట్టి బౌండరీలు గీసి ఊరుకుంటుందా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
మేడి బావి, జాలు బావి ఎక్కడ?
కీసర మండలం నాగారం గ్రామంలో ఐకామ్ కంపెనీని నెలకొల్పారు. ఇందులో మార్చి 26, 2020న మేఘా ఇంజినీరింగ్ యజమాన్యం 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. ఈ కంపెనీకి అత్యంత దగ్గరగా జాలు బావి కుంట 13 ఎకరాల 19 గుంటల్లో, మేడి బావి కుంట 5 ఎకరాల 21 గుంటలతో ఉండేవి. జాలు బావి కుంట సర్వే నెంబర్ 59లో ఎఫ్టీఎల్లో ఉన్న ఎకరం ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ పహరీ గోడ నిర్మించారు. నవంబర్ 7, 2020న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు వెళ్లి సర్వే చేసి నోటీసులు కూడా ఇచ్చారు. కానీ, ఐకామ్ కంపెనీ వాళ్లు ఎవరూ దీనిపై స్పందించలేదు. మార్చి 5, 2021న రెవెన్యూ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసింది. గతంలోనే ఐకామ్ కంపెనీ సర్వే నెంబర్ 56 నుంచి 61 వరకు ఉన్న బఫర్ జోన్లో ఎకరం 3 గుంటలు కబ్జా చేసిందని తేల్చింది. అంటే, మేఘా వచ్చాక బరితెగించి, ఎఫ్టీఎల్లోనే ఎకరం భూమిని కబ్జా చేసి ప్రహరీ నిర్మించారు. మున్సిపాలిటీ పాలక వర్గం, ఛైర్మన్ చెరువులను సందర్శించి తీర్మాణాలు చేశారు. కానీ, ఇప్పటి వరకు ఆ చెరువులపై చర్యలు తీసుకున్నది లేదు.
Also Read: Telangana Talli Statue: రేపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ..
హెచ్ఎంటీ బేరింగ్స్ నగర్నీ కొట్టేశారు
ఆయుధాల తయారీకి మరింత భూమి అవసరం ఉందనుకున్న మేఘా సిస్టర్ సంస్థ ఐకామ్, పక్కనే ఉన్న హెచ్ఎంటీ బేరింగ్స్ నగర్పై కన్నేసింది. సర్వే నెంబర్ 47, 55, 56, 60లోని లే అవుట్స్లో ఉన్న ప్లాట్ ఓనర్స్ని ఇనాం భూములని బెదిరించి లాక్కుందనే ఆరోపణలు ఉన్నాయి. ఎప్పుడో వేసిన రోడ్లు, పార్క్, ఖాళీ ప్రదేశం కూడా ఐకామ్ కంపెనీ వశమయ్యాయి. అక్రమంగా 12 వేల గజాల రోడ్లను, 1670 గజాల పార్క్ను కబ్జా చేయడంపై హైకోర్టు చర్యలు తీసుకోవాలని 2023లో తీర్పు కూడా ఇచ్చింది. కానీ, రిట్ పిటిషన్ 18801/2023 ఆదేశాలను అధికారులు పట్టించుకోలేదు. ఒక్క ఎకరం ప్లాట్స్ని కొనుగోలు చేసిన ఐకామ్ కంపెనీ ఇప్పుడు సుమారు 10 ఎకరాల్లో అందరినీ బెదిరించి, తక్కువ ధరలకు లాగేసుకుంది. అక్కడ చెరువు అనే ఆనవాలు కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తోంది.
కక్కుర్తి పనులతో దేశ రక్షణకు సేవ చేయగలరా?
ఐకామ్ కంపెనీ సెల్ టవర్స్ నిర్మాణం, డిఫెన్స్కి వైర్ లెస్ టెలికాం సేవలు అందిస్తోంది. మేఘా ఎంట్రీతో ఆయుధాలు తయారు చేసేందుకు వినియోగించుకుంటున్నారు. ముడి పదార్ధాల తయారీకి వాడుకుంటున్నారు. అందుకే, డిఫెన్స్లో అనుభవం ఉన్న కంపెనీని మేఘా కృష్ణారెడ్డి చేజిక్కించుకున్నారని చెబుతున్నారు. నాగారం మున్సిపాలిటీ లాంటి ప్రాంతంలో 50 కోట్లు ఖర్చు పెడితే పదెకరాలు ఎలాంటి లిటిగేషన్ లేని భూమి దొరుకుతుంది. కానీ, చెరువు భూమిని కబ్జా చేయడంతో వారి కక్కుర్తిని బయటపెట్టుకున్నారు. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలను ‘స్వేచ్ఛ’ అందిస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ ఈ వ్యవహారంపై ఫోకస్ చేస్తుందా? కబ్జాల అంతు తేల్చి పహారీ గోడతో పాటు ఆక్రమించిన భూమిని హైడ్రా విడిపించి చెరువుగా మారుస్తుందా? మేం సిద్ధం. మీరు సిద్ధమా?