Sharmila: తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల పోరాటం కొనసాగిస్తున్నారు. సంక్రాంతి తర్వాత పాదయాత్ర కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు యాత్ర కొనసాగించలేకపోతున్నానని తెలిపారు. ఆగిన చోట నుంచే యాత్ర తిరిగి మొదలుపెడతామని ప్రకటించారు.
పాదయాత్ర చేసుకోవచ్చని హైకోర్టు మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున కేసీఆర్ ఇప్పటికైనా యాత్రకు అనుమతించాలని షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణ పోలీసు వ్యవస్థ పూర్తిగా సీఎం అధీనంలోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. తన ఆమరణ దీక్షను భగ్నం చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. పోలీసుల భుజాన తుపాకీ పెట్టి తనను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. పోలీసులను కీలు బొమ్మల్లా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎంత సహనంతో ఉన్నా వేధింపులు ఆగడం లేదన్నారు.
లంచ్ మోషన్ పిటిషన్ కోసం హైకోర్టు వెళ్లేందుకు న్యాయవాదితో బయల్దేరినా పోలీసులు అడ్డుకున్నారని షర్మిల మండిపడ్డారు. కుటుంబపరంగా ఉన్న పనులు చేసుకోవడానికీ అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని షర్మిల గళమెత్తారు. ఏ అధికారంతో తనను కట్టడి చేస్తున్నారు? అని నిలదీశారు. కనీసం వైఎస్సార్టీపీ కార్యకర్తల్ని పార్టీ ఆఫీసులోకి రానివ్వడంలేదని మండిపడ్డారు.
పోలీసు శాఖపైనే కేసు వేయాలని నిర్ణయం తీసుకున్నామని షర్మిల వెల్లడించారు. పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయిందన్నారు. కనీసం న్యాయవ్యవస్థ అయినా బతికే ఉందన్న ఆశతో కేసు ఫైల్ చేస్తున్నట్లు షర్మిల చెప్పారు. తెలంగాణ పని అయిపోయిందని ఇప్పుడు కేసీఆర్ బందిపోట్ల రాష్ట్ర సమితి పేరుతో దేశం మీద పడ్డారని షర్మిల ఘాటు విమర్శలు చేశారు.