Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్రంలో చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. బీఆర్ఎస్ పాలన నుంచి ఇప్పటికీ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎంతో ఆతృతగా ఉన్నారు. కొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు లింకు ఉండటంతో వీటికోసం ఎదురుచూపులు ఎక్కువయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించడంతో చాలా మంది కొత్త రేషన్ కార్డులపై ఆశలు చిగురించాయి. ప్రజా పాలనలో రేషన్ కార్డుల కోసం చాలా మంది ప్రత్యేకంగా దరఖాస్తులు చేసుకున్నారు. రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తులు చేశారు. ఇందుకు సంబంధించి తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
వచ్చే నెల 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించబోతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్తో రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కాగా, రేషన్ కార్డులను, ఆరోగ్య శ్రీ కార్డులను వేర్వేరుగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే నిర్ణయం తీసుకుంది. అలాగే.. కొత్త రేషన్ కార్డుల అర్హులను గుర్తించడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఇకపై రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింక్ ఉండదని పునరుద్ఘాటిస్తూ.. వేర్వేరుగా కార్డులు జారీ చేస్తామని సీఎం వివరించారు. ప్రజా పాలనలో ప్రతి కుటుంబం నుంచి అవసరమైన వివరాలను సేకరించాలని, రాష్ట్రమంతటా అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజా పాలన నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలకు, సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించడానికి ఇక నుంచి ఈ హెల్త్ కార్డులు ప్రామాణికంగా ఉంటాయని సీఎం తెలిపారు. హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి ఎలాంటి పద్దతి అనుసరించాలి? ఏయే వైద్య పరీక్షలతో హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలి? గ్రామాల్లో హెల్త్ చెకప్ శిబిరాలు ఏర్పాటు చేయాలా? ఏ ల్యాబ్ల సాయం తీసుకోవాలి? వంటి వివరాలను వెంటనే పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Also Read: Hema Committee: అసలు ఈ హేమ కమిటీ అంటే ఏంటి.. ఇండస్ట్రీలో ఉన్న కీచకులు ఎవరు?
ఉస్మానియా హాస్పిటల్ తరలింపు
ఉస్మానియా హాస్పిటల్ను గోషా మహల్కు తరలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఇందుకోసం భూబదలాయింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే.. ఆస్పత్రి డిజైన్లో శ్రద్ధ తీసుకోవాలని, వచ్చే యాభై ఏళ్లను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం జరగాలని చెప్పారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డిజైన్ ఉండాలని, ఆ కొత్త హాస్పిటల్కు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్ కనెక్టివిటీ సరిగా ఉండేలా ప్రణాళికలు ఉండాలని వివరించారు. అలాగే.. గోషా మహల్ సిటీ పోలీసు అకాడమీకి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ఆదేశించారు.