PCB chairman Mohsin Naqvi reveals the reason behind the Pakistan team’s downfall: పాకిస్తాన్ క్రికెట్ ని సంపూర్ణంగా ప్రక్షాళన చేసే సమయం ఆసన్నమైందని పీసీబీ చైర్మన్ మోసిన్ నక్వీ తెలిపాడు. అన్నీ చూస్తున్నాం, అన్నీ వింటున్నాం.. కాకపోతే మార్పు రావాలంటే కొంత సమయం పడుతుంది. అదే తెరవెనుక జరుగుతోందని అన్నారు. మొత్తం పాకిస్తాన్ క్రికెట్ జట్టు, కోచింగ్ స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్ అందరినీ మార్చిపారేస్తామని తేల్చి చెప్పారు.
ఇప్పటివరకు కెప్టెన్లను మాత్రమే మార్చి చూశామని, జట్టులో సమతుల్యత లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారని అన్నారు. అందుకే గల్లీ స్థాయి నుంచి క్రికెట్ లో అద్భుత ప్రావీణ్యం చూపించేవారిని వెతికే పనిలో ఉన్నామని అన్నారు. అందుకోసం అంచెలంచెల వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అతి త్వరలోనే పాకిస్తాన్ టీమ్ కొత్త శక్తితో వచ్చి, ప్రపంచ క్రికెట్ ను శాసిస్తుందని తెలిపారు.
తొలిటెస్టులో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన పాక్ తీరుపై మాజీలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. పాక్ దిగ్గజ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది స్పందిస్తూ, ఒక టెస్టు మ్యాచ్ లో స్పెషలిస్టు స్పిన్నర్ లేకుండా ఎవరైనా బరిలోకి దిగుతారా? అని ప్రశ్నించాడు. ఆ పిచ్ ఎలాంటిదైనా కానివ్వండి.. నలుగురు పేసర్లతో ఆడి కొంప మీదకు తెచ్చుకున్నారని తెలిపాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ స్పిన్నర్ ధాటికి మనవాళ్లు విలవిల్లాడారని అన్నాడు.
Also Read: మహిళల టీ 20 ప్రపంచకప్.. ఇదే మన భారత జట్టు
అయినా తొలి ఇన్నింగ్స్ లో బ్రహ్మాండంగా ఆడుతున్న సమయంలో డిక్లేర్ చేయమని ఎవడు కెప్టెన్ కి సచ్చు సలహా ఇచ్చారని మండిపడ్డాడు. దానిని అద్భుతంగా ఉపయోగించుకున్న బంగ్లాదేశ్ లాభపడిందని తెలిపాడు. సొంత దేశంలో, సొంత పిచ్ పై పరిస్థితులు ఎలా ఉంటాయో గ్రహించలేని అధ్వాన స్థితిలో పాక్ జట్టు ఉందని సీనియర్లు దుయ్యబడుతున్నారు.
ఇప్పటివరకు బంగ్లాదేశ్ చేతిలో ఓటమన్నదే లేకుండా ఆడామని, వీళ్లు వచ్చి మొత్తం చెడగొట్టారని తిట్టిపోస్తున్నారు. ఒక్కరు ఒకరి మాట వినరు, అందుకే జట్టు అలా ఏడ్చిందని విమర్శిస్తున్నారు. కెప్టెన్ మాట ఎవ్వరూ వినరు.. ఇదెక్కడి గోల అని సీనియర్లు సీరియస్ అవుతున్నారు.