N Convention Centre: అక్కినేని నాగార్జున.. టాలీవుడ్లోని ప్రముఖ నటుల్లో ఒకరైన నాగ్, వాణిజ్యరంగంలోనూ కింగే. వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోయే తత్వం ఆయనదని అభిమానులు అంటుంటారు. అయితే, తాజాగా మాదాపూర్లోని ఎన్-కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత నేపథ్యంలో ఆయన పేరు మార్మోగింది. చెరువులోకి కట్టేసిన ఆ సెంటర్ను చూసి అంతా ఆశ్చర్యపోయారు. నాగార్జున ఏంటీ అలా చేశారు? ఆ ప్రాంతం చెరువులోకి ఉందనే సంగతి చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు.. అలాంటి నాగార్జున వంటి దిగ్గజ వ్యాపారవేత్త ఎందుకు తెలుసుకోలేకపోయారు? పైగా దానిపై కొన్నేళ్లుగా వివాదం నడుస్తున్నా అంత ధీమాగా ఎలా ఉన్నారు? ఇలా ఒకటేమిటి ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అయితే, ఆ ప్రాంతాన్ని ఎవరు కబ్జా చేశారు? అనుమతులు ఎలా ఇచ్చారనే విషయాలను పక్కన పెడితే.. అలా చెరువులను కబ్జా చేసి మూసేస్తే ఎన్ని ఘోరాలు జరుగుతాయనేది ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. ఇందుకు మన పక్క రాష్ట్రంలో ఉన్న బెంగళూరు నగరమే ఉదాహరణ. అయితే.. ఆ నగరం గురించి తెలుసుకొనే ముందు.. ఇప్పుడు మన నగరంలో ఉన్న పరిస్థితుల గురించి తెలుసుకుందాం.
హైదరాబాద్లో భారీ వర్షాలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే. ఒక్కసారే నగర వీధులన్నీ వాటికన్ సిటీ (నీటిపై తేలియాడే నగరం)ని తలపిస్తాయి. వాటర్ ఫాల్స్ కంటే వేగంగా రోడ్డుపై ప్రవహించే వరద నీరు.. ఎప్పుడు ఎవరిని పొట్టన పెట్టుకుంటాయో చెప్పలేం. నగరంలో ఎప్పుడు వర్షాలు వచ్చినా.. ఇదే పరిస్థితి. ప్రతి సీజన్లో ఎవరూ ఒకరు వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. మరి, ఈ పాపం ఎవరిది? నగర పాలక సంస్థలదా? ప్రజలదా? అవినీతి అధికారులదా? ఈ ప్రశ్నకు జవాబు.. ‘మన అందరిదీ’. ఎందుకంటే.. చెరువులను కబ్జా చేసి అపార్టుమెంట్లు, కమర్షియల్ బిల్డింగులు కడుతుంటే.. మనకెందుకులే అని ఊరుకుంటాం. ఇక అధికారుల సంగతైతే సరేసరి.. చేయి తడిపితే చెరువులను రాసిచ్చేస్తారు. కళ్లు మూసుకుని కబ్జాదారులకు సహకరిస్తారు. గత పదేళ్ల ప్రభుత్వ పాలనలో ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఈ అక్రమాలను ప్రశ్నించేవారు లేరు. ప్రశ్నిస్తే.. ప్రాణాలు ఉంటాయో లేదో కూడా తెలియదు. అలాంటి దౌర్జన్య పాలనలో ఎన్ని చెరువులు కనుమరుగయ్యాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇప్పటివరకు హైడ్రా చేస్తున్న కూల్చివేతలు జస్ట్ ఆరంభం మాత్రమే. మున్ముందు ఇంకా మరింత ప్రక్షాళన జరగనుంది. ఇదంతా మన భాగ్యనగరం భవిష్యత్తు కోసమే. లేకపోతే.. ఇటీవల బెంగళూరుకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో తెలిసిందే.
Also Read: సౌత్ లోనే రిచ్చెస్ట్ హీరో నాగార్జున.. ఆయన నికర ఆస్తుల విలువ ఎంతంటే..?
బెంగళూరులో నీటికి కటకట..
ఇక బెంగళూరు విషయానికి వస్తే.. గత వేసవిలో అక్కడి ప్రజలు చుక్కనీరు కోసం ఎంత కటకటలాడారో తెలిసిందే. స్నానాల మాట దేవుడెరుగు కనీసం తాగేందుకు గానీ, వంట చేసుకోడానికి కూడా నీరు లేదు. వేలకు వేలు డబ్బులు పోసి నీళ్లు కొనుక్కోవల్సి వచ్చింది. ఇందుకు కారణం.. చెరువులను కబ్జా చేసి బిల్డింగులు కట్టడమే. పరిమితికి మించిన జనాభా వల్ల నీటి వనరులపై భారం పడుతుంది. గ్రౌండ్ వాటర్ సరిపోదు. అయితే, ఎప్పుడూ వర్షాలు పడే బెంగళూరుకు గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం ఏంటా అనే సందేహం కలగక మానదు. అయితే, అక్కడ వర్షం పడుతుంది. కానీ, అది గ్రౌండ్లోకి చేరడం లేదు. ఎందుకంటే.. అక్కడ చాలావరకు చెరువులు, దాని పరిసరాలు కబ్జాకు గురయ్యాయి. వర్షం నీరు చేరేందుకు కూడా దారి లేదు. ఒక వేళ ఆ నీరు చెరువులోకి వెళ్తే.. చుట్టుపక్క ప్రాంతాలకు అన్ని సీజన్స్లో వాటర్ లభిస్తుంది. కానీ అక్కడ అలా జరగడం లేదు. అందుకే కొన్ని కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. భవిష్యత్తులో మనకు బెంగళూరు గతి పట్టకూడదంటే చెరువులను కాపాడుకోవల్సిందే.
ఎన్జీటీ మొట్టికాయలు.. 4వేల అపార్ట్మెంట్లకు ఆక్యుపెన్సీ రద్దు
సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట నేషనల్ గ్రీన్స్ ట్రిబ్యునల్ (NGT) అక్కడి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. అందులో.. చెరువులు, డ్రైనేజీలు, స్ట్రామ్ వాటర్ డ్రైన్స్కు 75 మీటర్ల వరకు ఎలాంటి కట్టడాలకు అనుమతి ఇవ్వకూడదని వెల్లడించింది. అయితే అప్పటికే అక్కడ చాలావరకు కట్టడాలు పూర్తయ్యాయి. పెంచిన లేక్ బఫర్ జోన్లో సుమారు 31,500 వరకు భవనాలు ఉన్నాయి. అలాగే స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ జోన్లో 19.4 లక్షల భవనాలు ఉన్నాయట. అయితే, వాటిలో చాలావరకు రెగ్యులైజేషన్ కావడం వల్ల ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. కానీ, మున్సిపాలిటీ (BBMP) అనుమతులు ఇచ్చిన సుమారు 4 వేలకు పైగా అపార్టుమెంట్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను రద్దు చేసింది. అంటే.. అక్కడ భవనాలు కొనుగోలు చేసిన ఎంతమంది నష్టపోయారో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి, మీరు కూడా ఫ్లాట్స్ లేదా ప్లాట్స్ కొనుగోలు చేసే ముందు.. అవి చెరువుల ఫుల్ ట్యాంక్, బఫర్ జోన్ల పరిధిలో ఉన్నాయో లేదో చూసుకోండి. మీరు చెరువులకు ఎంత ప్లేస్ ఇస్తే.. భవిష్యత్తులో నీటి కొరత ఉండదు. బెంగళూరు సిటీలా నీటి కోసం కటకటలాడాల్సిన పరిస్థితి ఉండదు.
బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే?
బఫర్ జోన్ అంటే.. చెరువులకు సమీపంలో ఉండే ప్రాంతం. ఆ పరిసరాల్లో ఎవరూ ఎలాంటి కట్టడాలు చేయకూడదు. అయితే ఈ పరిధి ప్రాంతాలను బట్టి మారుతుంటుంది. హైదరాబాద్ నగరంలో చెరువులకు 50 మీటర్ల పరిధిలో ఎలాంటి కట్టడాలు ఉండకూడదు. ఏమైనా తాత్కాలిక నిర్మాణాలు చేసినా సరే అధికారుల అనుమతి తప్పనిసరి. అయితే, నగర పాలకులు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో గుడ్డిగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఇక ఫుల్ ట్యాంక్ లెవల్ అంటే.. చెరువు పూర్తిగా నిండే కెపాసిటీ. ఒక వేళ దాని పరిధిలో ఎవరైనా ఏవైనా నిర్మాణాలు చేస్తే.. అవి చెరువులో మునిగిపోతాయి. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేసినా.. చెరువు ఉనికిని కోల్పోతుంది. అయితే, చెరువుల సమీపంలో ఇళ్ల నిర్మాణం చాలా డేంజర్. వయనాడ్ తరహాలో క్లౌడ్బరస్ట్ సంభవిస్తే.. పరిస్థితిని ఊహించలేం.