Telangana schools must follow sports period..Bhatti vikramarka: ఒకప్పుడు పిల్లలు కబడ్డీ, ఫుడ్ బాల్, హాకీ రన్నింగ్ రేస్ వంటి శారీరక శ్రమను ఇచ్చే క్రీడలకు ప్రాధాన్యమిచ్చేవారు. తప్పనిసరిగా పాఠశాలలలో ఒక పీరియడ్ క్రీడలకు కేటాయించేవారు. ప్రతి సంవత్సరం క్రీడలను ప్రోత్సహిస్తూ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు కూడా ఇచ్చేవారు. రానురానూ విద్యారంగంలో అంతకంతకూ కోర్సులు పెంచేస్తూ పాఠశాలల్లో క్రీడలు ఎత్తేయడం మొదలుపెట్టారు. పైగా మహానగరాలలో స్కూలు రెంట్లు భారీగా కట్టుకోలేక చిన్న గదులలోనే విద్యార్థులకు చదువులు కొనసాగిస్తున్నారు. దానితో విద్యార్థులకు విద్య తప్ప మరే ఇతర అంశాలపై దృష్టి సారించే అవకాశం కలగడం లేదు. అందుకే దీనిని సీరియస్ గా తీసుకున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
స్పోర్ట్స్ పీరియడ్ మస్ట్
ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో తప్పనిసరిగా స్పోర్ట్స్ కు సంబంధించిన పీరియడ్ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్ ఎల్ బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఉద్యోగుల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. ప్రపంచ స్థాయిలోనే తెలంగాణ నుంచి అద్భుతమైన క్రీడాకారులు తయారు కావాలని జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో తెలంగాణకు ప్రాధాన్యం పెరిగేలా కృషి చేస్తామని అన్నారు. ఇందు కోసం హైదరాబాద్ లో జాతీయ క్రీడలను నిర్వహించేలా కేంద్రాన్ని అనుమతి కోరతామని అన్నారు. ఇప్పటికి క్రీడలు నిర్వహించుకునేందుకు నిధుల కొరత లేదని అన్నారు. భవిష్యత్ లోనూ క్రీడా నిధులు పెంచేందుకు కృషి చేస్తామని అన్నారు. తగిన శారీరక శ్రమను ఇచ్చే క్రీడలు లేక విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారని..చిన్నప్పటినుంచే వారిని శారీరక శ్రమను ఇచ్చే క్రీడలకు సంసిద్ధం చేసే దిశగా పాఠశాలలు కృషి చేాలని అన్నారు.
క్రీడా స్ఫూర్తి
ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కలిగి వుండాలని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్ వేదికలపై తెలంగాణ క్రీడాకారులు విజయాలు సాధించాలని అన్నారు. గత పాలకుల హయాంలో కేటాయించిన క్రీడా సామాగ్రి, క్రీడా ప్రాంగణాలను తగిన రీతిగా మరమ్మతులు చేయించి ఉపయోగించుకుంటామని..తప్పని సరిగా పాఠశాల దశ నుంచే క్రీడా స్ఫూర్తిని ప్రతి విద్యార్థి కలిగి వుండాలని తమ ధ్యేయమని అన్నారు. ఇందుకోసం అవసరమైతే క్రీడా ఉపాధ్యాయ పోస్టులను పెంచుతామని అన్నారు.