BRS confused by Hydra Demolition: హైడ్రాకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా ఇమేజ్ విపరీతంగా పెరిగిపోయింది. సీఎం సాహసోపేత నిర్ణయంతో సొంత పార్టీలో వ్యతిరేకత వస్తుందని మొదట్లో భావించారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు పలుకుతూ తమ ప్రాంతాల్లో కూడా హైడ్రా లాంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మరోవైపు బీజేపీ, వాపపక్షాల నేతలు కూడా హైడ్రాని ప్రశంసిస్తుండటం విశేషం.
గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు ఆక్రమణదారుల గుండెల్లో దడపుట్టిస్తున్నాయి. వరసగా కూల్చివేతలకు పాల్పడుతూ అక్రమార్కుల గుండెల్లో హైడ్రా నిద్రపోతోంది. పేద, ధనిక, సినిమా స్టార్లు, రాజకీయ నేతలు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని అంగుళం ఆక్రమించిన తీవ్రంగా స్పందిస్తోంది. అధికార కాంగ్రెస్ నేతలను వదలకుండా హైడ్రా స్పీడ్ పెంచుతూ.. అటు పొలిటికల్ సపోర్ట్తో పాటు ఇటు సామాన్యుల మద్దతు పొందుతోంది.
ఇలా వరుసగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు రేవంత్రెడ్డికి మద్దతు పలుకుతూ.. తమ ప్రాంతాల్లో కూడా హైడ్రా లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలి కోరుతున్నారు. ఇటీవల టాలీవుడ్ యాక్టర్ నాగార్జునకు చెందిన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ను అధికారులు కూల్చివేశారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ఆయన హైకోర్టు కూడా వెళ్లారు. అధికారులు మాత్రం నేలమట్టం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్శిటీపై కూడా ఆరోపణలు వచ్చాయి.
ఆ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు మాత్రం హైడ్రా దూకుడు మింగుడుపడటం లేదు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శలు గుప్పిస్తున్నారు … పల్లా రాజేశ్వర్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆర్థికంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారని.. తమ ఎమ్మెల్యేలను లాక్కోవడానికే కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
మరోవైపు ఇతర విపక్ష నేతలు కూడా హైడ్రాకు మద్దతు పలుకుతున్నారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అక్రమ కట్టడాల కూల్చివేతను స్వాగతించారు. తాను సొంతంగా చేయించిన సర్వేలో హైదరాబాద్లో 78 మంది హైడ్రా మంచిదని చెప్తానన్నారు. బీజేపీ నేతలందరూ ముక్తకంఠంతో హైడ్రాని ప్రశంసిస్తున్నారు.
Also Read: గులాబీ గుండెల్లో హైడ్రా గుబులు..!
సీపీఐ సీనియర్ నేత నారాయణ అయితే హైడ్రాపై తనదైన స్టైల్లో స్పందించారు. రేవంత్ రెడ్డి పులి మీద సవారీ చేస్తున్నారని.. మధ్యలో ఆపేస్తే పులి తినేస్తుందని అంటున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం జైళ్లను బాగుచేయాలన్న నారాయణ.. హైడ్రాతో బడా బాబులు అయినా జైలుకు వెళ్ళాల్సి వస్తుందని లేదా వాళ్ల ఒత్తిడితో రేవంత్ రెడ్డి అయినా జైలుకు వెళ్లే ప్రమాదముందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎవరేం అనుకున్నా రాజధానిలో నగరంలో హైడ్రా మాత్రం నాన్ స్టాప్గా కూల్చివేతలు నిర్వహిస్తోంది. ఇప్పటికే చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమించి 18 చోట్ల చేపట్టిన 166 నిర్మాణాలను కూల్చివేసింది .. సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోదరుడు పల్లం ఆనంద్, మంథని నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సునీల్రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కరరావు, ప్రొ కబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమకు చెందిన కట్టడాలు నెలమట్టమయ్యాయి.
బంజారాహిల్స్ లోటస్ పాండ్ మొదలు, మన్సూరాబాద్, బీఆర్కేనగర్, గాజులరామారం, అమీర్పేట, మాదాపూర్, గండిపేటలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదించింది. ఆక్రమణలకు మద్దతిస్తున్న వారిపైనా హైడ్రా చర్యలకు ఉపక్రమిస్తోంది. నందగిరిహిల్స్ పార్క్ ప్రహరీ కూల్చివేసి ఆక్రమణలకు పాల్పడిన స్థానికులకు మద్దతుగా నిలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై కేసు నమోదైందంటేనే అక్రమ కట్టడాలపై రేవంత్ సర్కార్ ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది.
తాజాగా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది …ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడ కూల్చివేతలు చేపట్టారు … హైడ్రా రంగంలోకి దిగినప్పటి నుంచి నగరవ్యాప్తంగా చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజాప్రతినిధుల అక్రమ నిర్మాణాలకు సంబంధించి డ్రోన్ చిత్రాలను ‘ఎక్స్’లో పోస్ట్ చేసి వాటిని సైతం కూల్చాలని హైడ్రాను కోరుతున్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీ నేతల నివాసాలుండటం గమనార్హం.