Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని వైరస్ గా పేర్కొన్నారు. బీజేపీ వ్యాక్సిన్ అని చెప్పారు. మరి వైరస్ కావాలో? వ్యాక్సిన్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని బండి సంజయ్ సూచించారు. జగిత్యాల జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న బండి సంజయ్.. గంగాధర మండలం తుర్గాసిపల్లి శిబిరం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన తప్పుల చిట్టాను దగ్గర పెట్టుకుని సీఎం కేసీఆర్ వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు నిర్వాసితులను ఎందుకు పట్టించుకోరు? అని ప్రశ్నించారు. కొండగట్టు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను ఎందుకు ఆదుకోవడం లేదని నిలదీశారు. నయీమ్, డ్రగ్స్ కేసులపై గతంలో వేసిన సిట్ నివేదికలు ఏమయ్యాయి? అని అడిగారు.
హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసు వ్యవహారాన్ని తాము వదిలిపెట్టబోమని బండి సంజయ్ స్పష్టం చేశారు. తనను ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపైనా స్పందించారు. ఎంపీగా తానేం చేయాలో చేస్తున్నానని తెలిపారు. అధికార పార్టీ నేతలు ఏం చేస్తున్నారో ముందు చెప్పాలని ప్రశ్నించారు. తాము ఫ్లెక్సీలు పెట్టడం మొదలు పెడితే అధికార పార్టీ నేతలు తల ఎత్తుకోలేరని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా.. అక్కడ ఫ్లెక్సీలు వెలిశాయి. కొందరు వ్యక్తులు సంజయ్ ను ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు పెట్టారు. బీజేపీ హయాంలో… తెలంగాణ రాష్ట్రానికి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు వచ్చాయని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పాదయాత్ర అక్కడకి చేరుకునే సరికి ఎలాంటి వాతావరణం నెలకొంటుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ స్పందించి అధికార పార్టీ నేతలను ఎదురు ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దు హెచ్చరించారు.