Pakistan and Bangladesh Docked WTC Points for Slow over Rate in 1st Test Match: మూలిగే నక్కపై తాటిపండు పడటమంటే ఇదేనేమో.. ఇప్పటికే పీకల్లోతు కష్టాలతో పాటు, ఇంటా బయట పరువు పోయి ఉన్న పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రావల్పిండిలో బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ పరాభవం మరిచిపోకముందే, మరో దెబ్బ పడింది.
ఈ టెస్ట్ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ నమోదైంది. అంటే అటు పాక్, ఇటు బంగ్లా రెండు జట్లు కూడా నిర్ణీత సమయంలో బౌలింగు వేయలేదు. పాకిస్తాన్ ఆరు ఓవర్లు తక్కువగా బౌలింగు చేస్తే, బంగ్లాదేశ్ 4 ఓవర్లు తక్కువగా వేసింది. దీంతో రెండు జట్లపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చర్యలు తీసుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్లలో కోత విధించింది.
పాకిస్తాన్ కి 6, బంగ్లాదేశ్ కి 4 పాయింట్ల కోత విధించింది. అసలే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ర్యాంకింగుల్లో 8వ స్థానంలో పడి పాకిస్తాన్ గిలగిల్లాడుతోంది. ఈ కోత కారణంగా, టెస్ట్ ఛాంపియన్ షిప్ నకు దాదాపు అర్హత కోల్పోయినట్టేనని అంటున్నారు. ఒకవేళ ఇకనుంచి పాక్ వరసపెట్టి గెలిచినా సరే, ఇండియా, ఆస్ట్రేలియాను దాటి రాలేదని అంటున్నారు.
Also Read: యూఎస్ ఓపెన్ 2024, జకోవిచ్ శుభారంభం..
అలాగే రిజ్వాన్ పట్ల దురుసుగా ప్రవర్తించిన షకిబ్ హసన్పై కూడా చర్యలు తీసుకుంది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో రిజ్వాన్ బ్యాటింగ్కు సిద్ధంగా లేకపోవడంతో ఆగ్రహానికి గురైన షకిబ్.. అతడివైపు బంతిని విసిరాడు. అది వెళ్లి కీపర్ చేతిలో పడింది. ఇది జరిగిన వెంటనే అంపైర్ కూడా మందలించాడు. ఈ నేపథ్యంలో షకిబ్పై ఐసీసీ చర్యలు తీసుకుంది.
అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. అంతేకాకుండా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1ను ఉల్లంఘించినందుకు ఒక డీ మెరిట్ పాయింట్ను కూడా అతడి ఖాతాలో జమచేసింది. ఇకపోతే రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో ఆల్రడీ బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బ్రహ్మాండంగా ఆడుతున్న సమయంలో తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన పాక్ జట్టు…ఓటమిని కోరి తెచ్చుకుందని అభిమానులు విమర్శిస్తున్నారు.