KCR silent: తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? పార్టీ భారమంతా కేటీఆర్, హరీష్రావు భుజాలపై పడిందా? హైడ్రా వ్యవహారంలో కేసీఆర్ మౌనం వెనుక ఉద్దేశం ఏంటి? ఆపరేషన్ తర్వాత ఆరోగ్యం సహకరించలేదా? ఇవే ప్రశ్నలు గులాబీ శ్రేణులను వెంటాడుతున్నాయి.
తెలంగాణ రాజకీయాలు కొద్దిరోజులుగా హాట్ హాట్గా ఉన్నాయి. ఒకప్పుడు ఏపీ రాజకీయాలు ఇదే విధంగా ఉండేవి.. కాకపోతే అక్కడ విపక్షం సైలెంట్ అయిపోయింది. గడిచిన రెండువారాలుగా తెలంగాణ లో అధికార కాంగ్రెస్- విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది. ఛాలెంజ్లు, సవాళ్లు కొనసాగాయి.. ఇప్పటికీ ఉన్నాయనుకోండి.. అదే వేరే విషయం.
అధికార కాంగ్రెస్ను ఎదుర్కోవడానికి నానాకష్టాలు పడుతోంది బీఆర్ఎస్. ప్రభుత్వ రుణమాఫీ విషయంలో కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితమైంది. రుణమాఫీ అందని రైతులకు సంబంధించిన ఎలాంటి డేటాను బయటపెట్ట లేదు.
ALSO READ: నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీం తీర్పు విచారణ.. బెయిల్ వస్తుందా?
హైడ్రా వ్యవహారంలో కారు పార్టీ కీలక నేతలంతా ఇరుకునపడ్డారు. ఈ తరహా వ్యవస్థ ఉండాలని ఏ ఒక్కరూ నోరు ఎత్తే సాహనం చేయలేకపోయారు. దాన్ని నుంచి తప్పించుకునేందుకు అధికార పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేశారు. అయినా సరే అధికార పార్టీ పట్టించుకోలేదు.
కనీసం కేసీఆర్ అయినా నోరు ఎత్తుతారని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆశించారు. ఈ విషయంలో ఎందుకోగానీ సైలెంట్ అయ్యారాయన. లిక్కర్ కేసులో అరెస్టయిన తీహార్ జైలులో ఉన్న కవితను చూడటానికి ఒక్కసారి కూడా హస్తినకు వెళ్లలేదు. దీంతో కేసీఆర్కు ఏమైందంటూ చర్చించుకోవడం నేతల వంతైంది.
ఆపరేషన్ తర్వాత కేసీఆర్ కాస్త వీక్గా ఉన్నారంటూ నేతలు మాట్లాడు కుంటున్నారు. దీంతో పార్టీ భారమంతా కేటీఆర్, హరీష్రావులపై పడింది. తుంటి ఎముక ఆపరేషన్ తర్వాత కేవలం రెండుసార్లు మాత్రమే బయటకు వచ్చారు మాజీ సీఎం. ఒకసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీకి ఒక్కరోజు మాత్రమే హాజరయ్యారు.
మనుపటి మాదిరిగా కేసీఆర్ వాయిస్ లేదన్నది నేతల మాట. ఫామ్ హౌస్కి పరిమితమవుతున్నారు. ఒకవేళ పార్టీలో ఏదైనా అనుకోని పరిస్థితులు తలెత్తినప్పుడు.. నేతలను తన ఫామ్ హౌస్కు పిలిపించు కుని మాట్లాడిన సందర్భాలు మాత్రమే ఉన్నాయి.
సింపుల్గా ఒక్కమాటలో చెప్పాలంటే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ బయటకు రావడం మానేశారు. ఓటమి నుంచి పెద్దాయన ఇంకా జీర్ణించు కోలేదన్నది కొందరి మాట. అందుకే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై సైలెంట్ అయ్యారన్నది ఆ పార్టీ నేతల మాట. అధికారంలో ఉన్నప్పుడూ కేసీఆర్ బయటకు వచ్చిన సందర్భాలు లేవని, ఎక్కువకాలం ఫామ్ హౌస్కి పరిమితమయ్యారని అంటున్నారు.
60 ఏళ్ల వయసులో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు ఆయనకు ఏడు పదుల వయసు వచ్చిందని అంటున్నారు. గతంలో మాదిరిగా వాయిస్ రైజ్ చేయకపోవచ్చని అంటున్నారు. ఈ లెక్కన పార్టీ సంబంధించి నిర్ణయాలు కేటీఆర్, హరీష్రావు చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని గులాబీ కేడర్ చెబుతోంది.