MLC Kavitha Bail Petition: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన కవిత గత 5 నెలలుగా తీహార్ జైలులోనే ఉన్నారు. ఆమె బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు ఉన్నందున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈసారి కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు.
లిక్కర్ స్కామ్ కేసుల్లో కవితపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. మార్చి 15వ తేది నుంచి ఆమె తీహార్ జైలులో ఉంటున్నారు. అప్పటి నుంచి చాలా సార్లు ఆమె బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టు, రౌస్ అవెన్యూ కోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించినప్పటికీ అన్ని చోట్లా ఎదురు దెబ్బలే తగిలాయి. ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. బెయిల్ కోసం ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్ న్యాయవాదులతో చర్చించారు. కానీ జూలై 1న కవితకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.
ఈ నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈనెల 20న విచారణ చేసిన న్యాయస్థానం ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. దీంతో కవిత బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. దీంతో ఈసారి కవితకు తప్పకుండా బెయిల్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
Also Read: ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు.. కవిత రిలీజ్ ఖాయమా?
ఇదిలా ఉండగా, జూలై 16న కవిత తొలిసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మళ్లీ ఆగస్టు 22న కవిత అస్వస్థతకు గురయ్యారు. ఈసారి ఢిల్లీ ఎయిమ్స్ కు కవితను తరలించి వైద్య పరీక్షలు చేశారు. అదేరోజు మధ్యాహ్నం తిరిగి జైలుకు తరలించారు.