Punjab Sikh council seeks ban on Kangana Ranaut’s ‘Emergency’ in country: బాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య త్వరలో విడుదల కానున్న మూవీ ఎమర్జెన్సీ. కంగనా రనౌత్ ఈ మూవీలో ఇందిరాగాంధీ గా కనిపించనున్నరు. సెప్టెంబర్ 6న విడుదల కాబోతున్నట్లు రిలీజ్ డేట్ ప్రకటించారు నిర్మాతలు. మళ్లీ అది నవంబర్ నెలకి పోస్ట్ పోన్ అయింది. రీసెంట్ గా రిలీజయిన ట్రైలర్ లో కంగనా తన నట విశ్వరూపం చూపారు. కచ్చితంగా ఈ మూవీకి జాతీయ అవార్డు కంగనాను వరిస్తుందని అభిమానులు చెబుతున్నారు. ఇప్పటిదాకా కంగనా నాలుగు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు అందుకుంది. విశేషం ఏమిటంటే ఎమర్జెన్సీ మూవీని కంగనా నే డైరెక్ట్ చేశారు. ఈ మూవీ తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని కంగనా నమ్ముతోంది.
కాంగ్రెస్ నేతల అభ్యంతరాలు
జీ స్టూడియోస్ మరియు మణికర్ణిక ఫిలింస్ సంయుక్తంగా కలిసి నిర్మించిన ఎమర్జెన్సీ మూవీ కి మొదటినుంచి వివాదాస్పద ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. బీజేపీకి చెందిన కంగనా రనౌత్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఇందిరాగాంధీగా నటించడమే ఇందుకు కారణం అంటున్నారంతా. ఈ మూవీలో ఇందిరాగాంధీని విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఈ సినిమా నిర్మాణం ఆపేయాలని చాలా గొడవలే చేశారు. కాగా మొన్న విడుదలైన ఎమర్జెన్సీ ట్రైలర్ లో కొన్ని అభ్యంతర సన్నివేశాలు ఉన్నాయని.. సిక్కులను ఈ మూవీలో తప్పుగా చూపించారని అంటూ పంజాబ్ ఎంపీ సరబ్ జిత్ సింగ్ ఖల్సా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఈ మూవీ విడుదలను ఆపేయాలని కేంద్రానికి లేఖ రాశారు. దీనితో ఈ మూవీ విడుదలపై సందిగ్ధత నెలకొంది. అవసరమైతే కోర్టుకు సైతం వెళ్లి స్టే తెచ్చుకుంటామని సిక్కు నేతలు చెబుతున్నారు.
Also Read: పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొడుతున్న స్త్రీ
21 నెలల చీకటి కోణం
1975 సంవత్సరం నుంచి 77 మధ్యకాలంలో దాదాపు 21 నెలలు భారతదేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. దీనినే ఎమర్జెన్సీ పీరియడ్ గా పిలుస్తారు. ఈ 21 నెలల కాలంలో నాటి ఇందిరాగాంధీ హయాంలో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడం..అకారణంగా జైలుకు పంపించడం వంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడింది. పౌరుల స్వేచ్ఛకు కూడా భంగం కలిగించే రీతిలో చట్టాలు చేశారు. నేరం రుజువు కాకుండానే వారిని జైలుకు పంపించారు. ఇలా నాటి చీకటి కాలంలో జరిగిన అనేక దురాఘతాలను చూపించే ప్రయత్నమే ఎమర్జెన్సీ మూవీ మూల కథాంశం.
భయపడుతున్న డిస్ట్రిబ్యూటర్లు
ఈ మూవీని ఎలాగైనా విడుదల చేయించాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. అయితే ఈ మూవీని ఎలాగైనా సరే అడ్డుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇలా రెండు పార్టీల గొడవల మధ్య విడుదల కాబోతున్న ఎమర్జెన్సీ విడుదలకు ముందే ఎన్నో వివాదాలు క్రియేట్ చేస్తోంది. ఇక విడుదలయ్యాక ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తుందో అని డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు. ఇప్పటికే ఎమర్జెన్సీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరుపుకుంది. అసలే వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ కి ఈ మూవీతో మరిన్ని వివాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నాయి సినీ వర్గాలు.