Namitha: ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫేమ్ ఉన్నప్పుడు హీరోయిన్ కు ఉండే విలువ.. ఫేమ్ పోయాక ఉండదు. గ్లామర్ ఉన్నప్పుడు ఒక విలువ ఉంటే.. ఆ గ్లామర్ పోయాక ఒకలా చూస్తారు. తాజాగా హీరోయిన్ నమిత పరిస్థితి అలానే ఉంది. ఒకప్పుడు ఆమె అందానికి గుడికట్టిన వారే.. ఇప్పుడు ఆమెను గుడిలోనికి రానివ్వకూండా అడ్డుకున్నారు.
అసలు ఏం జరిగింది అంటే.. హీరోయిన్ నమిత.. తన కుటుంబంతో కలిసి నేడు కృష్ణాష్టమి సందర్భంగా మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయానికి దర్శనం కోసం వెళ్లింది. అయితే అక్కడ ఆమెను ఆలయ అధికారులు అడ్డుకున్నారని, హిందూ కుల ధృవీకరణ పత్రం ఉంటేనే లోనికి రానిస్తామని దురుసుగా మాట్లాడారని నమిత ఆరోపించింది. ఈ విషయాన్ని ఆమె ఒక వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది.
” అందరికీ నమస్కారం.. ఈరోజు మీనాక్షీ ఆలయంలో అధికారులు నాతో దురుసుగా ప్రవర్తించారు. హిందూ కుల ధృవీకరణ పత్రం ఉంటేనే లోనికి పంపిస్తామని అహంకారంగా మాట్లాడారు. నేను పుట్టకతోనే హిందువును. నన్ను ఇలా అవమానించడం పద్దతిగా లేదు. ఆ అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
ఇకపోతే ఆ అధికారులు మాత్రం వేరే విధంగా చెప్పుకొస్తున్నారు. నమితను తాము ఏమి అనలేదని, బయట కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పామే తప్ప .. ఆమెతో దురుసుగా మాట్లాడలేదని చెప్పుకొస్తున్నారు. ఈ ఘటనలో ఎవరిది నిజమో తెలియడం లేదు. దీంతో నెటిజన్స్ కొందరు నమితకు సపోర్ట్ చేస్తుండగా.. ఇంకొందరు ఆలయ అధికారులకు సపోర్ట్ గా నిలబడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
నమిత.. తెలుగులో సొంతం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా తరువాత స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ చిన్నది.. బరువు పెరిగి.. కోలీవుడ్ కు దగ్గరయింది. అక్కడ నమిత అందానికి ఫిదా అయ్యి తమిళ తంబీలు ఆమెకు గుడి కట్టారు కూడా. అలాంటి అందాల భామకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడం బాధాకరమని కొందరు చెప్పుకొస్తున్నారు. పెళ్లి తరువాత నమిత సినిమాలకు దూరమయ్యింది. ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న ఈ బ్యూటీ.. వచ్చే ఎన్నికల్లో హీరో విజయ్ కు పోటీగా నిలబడతానని చెప్పుకొచ్చింది. మరి ఈ భామ అనుకున్నది సాధిస్తుందా.. ? లేదా.. ? అనేది కాలమే నిర్ణయించాలి.