Rajiv Gandhi Civils Abhayahastam Scheme Cheques Distribution: రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సచివాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొని అభ్యర్థులకు చెక్కులను పంపిణీ చేశారు. సివిల్స్ మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం రూ. లక్ష చెక్కులను పంపిణీ చేసేందుకు సింగరేణి ఆర్థిక సాయం చేసింది.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో అభ్యర్థులకు ఇలా సాయం చేయడం మొదటిసారి అన్నారు. అభ్యర్థులకు ఎంతోకొంత సాయం చేయాలన్న ఉద్దేశంతో చెక్కుల పంపిణీ చేస్తున్నామంటూ డిప్యూటీ సీఎం చెప్పారు. ఇది రాష్ట్రానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.
Also Read: రేవంత్ రెడ్డి పులి మీద నుంచి దిగొద్దు.. దిగితే మింగేసే ప్రమాదముంది: నారాయణ
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..’మెయిన్స్ అర్హత సాధించిన అభ్యర్థులకు అభినందనలు తెలుపుతున్నా. గత ప్రభుత్వం నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదు. నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. యువతకు ఉపాధి కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర యువత దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి. గత ప్రభుత్వం నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదు. 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగాలిచ్చాం. త్వరలో మరో 35 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం.
నిరుద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. తెలంగాణ యువత ఉన్నత స్థాయిలో రాణించాలి. నైపుణ్యాల కోసమే స్కిల్స్ వర్సిటీని ఏర్పాటు చేశాం. చదువుకు తగ్గ నైపుణ్యాలు లేక అవకాశాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం యంగ్ ఇండియా వర్సిటీ ద్వారా 2 వేల మందికి శిక్షణ. వచ్చే ఏడాది నుంచి వర్సిటీలో ఏటా 20 వేల మందికి శిక్షణ ఉంటుంది. 2028 ఒలింపిక్స్ లో తెలంగాణ అథ్లెట్లకు అత్యధికంగా పథకాలు వచ్చేలా కృషి చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం. 25-30 ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తాం. త్వరలోనే అన్ని వర్సిటీలకు వీసీల నియామకం చేపడుతాం. వర్సిటీల్లోని అన్ని ఖాళీలను భర్తీ చేస్తాం’ అంటూ సీఎం పేర్కొన్నారు.
Also Read: కారు నడుపుతూ హెల్మెంట్ పెట్టుకోలేదని ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు.. అది కూడా ఎంతంటే..?
కాగా, ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడాన్ని రాష్ట్ర ప్రజలు, మేధావులు, విద్యార్థులు స్వాగతిస్తున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం మరిన్ని చేపట్టాలంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.