నిజానికి గాజాలో హమాస్, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో వేలాది మంది అమాయకప్రజలు సమిధలవులుతున్నారు. సాధారణ ప్రజలను తమ రక్షణ కవచంలాగా మార్చుకొని హమాస్ ఆపరేట్ చేస్తోంది. వారిని ఎలాగైనా మట్టుపెట్టాలని ఇజ్రాయెల్ దూకుడుగా ముందుకు పోతుంది. వీరిద్ధరి పంతానికి బలవుతున్నది మాత్రం అమాయక పౌరులే. అందుకే చాలా రోజులుగా ఇరు వర్గాలు చర్చలు జరిపి.. కాల్పులు విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. నిజానికి దీనికి అనుగుణంగా అడుగులు కూడా పడ్డాయి.
గాజాలో కాల్పుల విరమణకు హమాస్తో చర్చలకు ఓకే అని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రకటించారు. దీనికి హమాస్ కూడా ఓకే అంది. ఈజిప్ట్ రాజధాని కైరో చర్చలకు వేదికైంది. అయితే గతంలో కూడా చర్చలు జరిగాయి కానీ.. ఎలాంటి పరిష్కారం లేకుండానే ముగిశాయి. అయితే చర్చలు మాత్రం సానుకూలంగానే జరిగాయని ప్రకటించాయి. దాడులను ఆపేయడం, బంధీలను విడుదల చేయడంపై చర్చలు జరిగాయి. అయితే కొత్త షరతులను అంగీకరించలేదని మాత్రం హమాస్ ప్రకటించింది.
గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ ఆర్మీని మోహరించడం.. ఖైదీల మార్పిడిపై షరతులు ఉండాలనేది ఇజ్రాయెల్ డిమాండ్స్.. అయితే పూర్తిగా కాల్పుల విరమణ.. ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ, నిర్వాసితులను వెనక్కి పిలవడం, ఎలాంటి షరతులు లేకుండా ఖైదీలను మార్పిడి చేసుకోవాలన్నది హమాస్ డిమాండ్. దీనిపైనే ప్రస్తుతం కైరోలో చర్చలు జరగాల్సి ఉంది. సరిగ్గా అదే సమయంలోనే హెజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య దాడులు మొదలయ్యాయి.
నిజానికి గాజాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న మారణహోమానికి సరిగ్గా ఫుల్స్టాప్ పడుతుందనుకున్న సమయంలో ఈ దాడులు ఎందుకు జరిగాయి? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. నిజానికి హమాస్, హెజ్బుల్లా రెండు ఇరాన్ మద్దతిచ్చే సంస్థలే. ఈ రెండు కూడా ఇజ్రాయెల్ అస్థిత్వాన్ని గుర్తించేందుకు అస్సలు అంగీకరించడం లేదు. మరోవైపు ఇరాన్ గడ్డపై హనియా హత్యను ఆ దేశాధినేతలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో శాంతి ఒప్పందం జరిగితే అది ఇజ్రాయెల్ విజయంగా భావించాల్సి వస్తుంది.. అందుకే ఈ ఒప్పందాన్ని ఎలాగైనా రద్దు చేయాలనుకుంటున్నారా? అనేది ఒక అనుమానం.
Also Read: హెజ్బుల్లాపై భారీస్థాయిలో దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్.. అదే స్థాయిలో హెజ్బుల్లా రివర్స్ అటాక్
నిజానికి ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్ కూడా అంత సుముఖంగా లేదని చెప్పాలి. కానీ గాజాలో రోజురోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్యతో అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఆ దేశాధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏది ఏమైనా ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చేందుకు ప్రయత్నిస్తామని. అందుకే ఇప్పుడు అమెరికా ఒత్తిడి చేయడంతోనే ఇజ్రాయెల్ ఈ చర్చలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్కు ఈ చర్చలు జరగడం ఎంత ఇష్టం లేదన్నది చెప్పేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే.. ఈ చర్చలు జరుగడానికొ కొన్ని గంటల ముందే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజాపై బాంబుల వర్షం కురిపించింది. మూడు వేర్వేరు దాడుల్లో 36 మంది మరణించినట్టు తెలుస్తోంది.
మొత్తానికైతే పరిస్థితులన్నింటిని చూస్తుంటే ఉద్రిక్తతలు పెరిగే అవకాశమే తప్ప.. తగ్గే అవకాశమైతే కనిపించడం లేదు. హెజ్బుల్లా రాకెట్ దాడులు చేయడంపై యెమెన్లోని హౌతిలు ప్రశంసలు కురిపించారు. త్వరలో తాము కూడా ఇజ్రాయెల్పై దాడులు చేసేందుకు రెడీగా ఉన్నామని ప్రకటించారు. సో.. పరిస్థితి మరింత దిగజారే పరిస్థితులే కనిపిస్తున్నాయి.
ప్రస్తుతానికైతే కొన్ని ప్రశ్నలకు సమాధానమైతే దొరకడం లేదు. ఫస్ట్ ఫేజ్ దాడులు పూర్తయ్యాయని హెజ్బుల్లా చెబుతుంది. అంటే మరిన్ని దాడులు చేయబోతున్నారా? చేస్తే ఇజ్రాయెల్ ఎలా రియాక్ట్ అవుతుంది? పరిస్థితి మరింత దిగజారితే సీన్లోకి అమెరికా ఎంట్రీ ఇస్తుందా? ఇదే సమయంలో హౌతీలు కూడా దాడులకు తెగబడితే పరిస్థితి ఏంటి? ఇవన్నీ కాకుండా ముందే ఈ రెండు గ్రూప్లపై ఇజ్రాయెల్ దాడులు చేస్తే పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని మిడిల్ ఈస్ట్ వైపే చూస్తున్నాయి.