Tanvi Patri of India wins Asian U15 Championships: పిట్ట కొంచెం.. బ్యాట్ ఘనం అన్నట్టుగా తన్వి విజయాల మీద విజయాలు సాధిస్తోంది. ముఖ్యంగా ఆసియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ‘తన్వి పత్రి’ ఛాంపియన్గా నిలిచింది. చైనాలోని చెంగ్డూ వేదికగా జరిగిన అండర్-15 బాలికల బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ఫైనల్లో 13 ఏళ్ల తన్వి.. 22-20, 21-11తో హుయెన్ ఎంగ్వుయెన్ (వియత్నాం)ను చిత్తు చేసి స్వర్ణం సాధించింది.
ఎలాంటి గందరగోళం, తత్తరపాటు లేకుండా తన్వీ ఆడే ఆటకు అందరూ ఫిదా అవుతున్నారు. చిన్ననాటి నుంచి తను ఓటమిని అస్సలు ఒప్పుకోదు. అంత పట్టుదల అమ్మాయి కావడంతోనే మొదటి నుంచి చివరి వరకు ఈ టోర్నీలో 5 మ్యాచ్ లు ఆడి, అందులో ఒక్క గేమ్ కూడా ఓడిపోకుండా విజయం సాధించింది. ఇది తన్వీ గొప్పతనం అంటే అని అందరూ కొనియాడుతున్నారు.
34 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో తొలి గేమ్లో 11-17తో వెనుకబడ్డ తన్వి.. ప్రత్యర్థి చేసిన తప్పులను రెండుచేతులా ఒడిసిపట్టుకుని ఒక్కో పాయింట్ దక్కించుకుని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో గేమ్లోనూ అదే ఊపుతో ఆడి గేమ్తో పాటు మ్యాచ్నూ కైవసం చేసుకుంది.
సాఫ్ట్ వేర్ ఉద్యోగాల రీత్యా తన్వీ తల్లిదండ్రులతో కలిసి చైనాలో ఉన్న తను 2017-20 మధ్య కాలంలో 9 టైటిళ్లు గెలిచింది. చైనాలోని జియాంగ్ యాంగ్ శిక్షణలో తన్వీ రాటు దేలింది. కరోనా కారణంగా ఇండియాకి వారు తిరిగి వచ్చేశారు. అప్పుడు తన్వీని బెంగళూరులో ప్రకాశ్ పదుకునే బ్యాడ్మింటన్ అకాడమీలో జాయిన్ చేశారు. అక్కడ తను మెలకువలన్నీ నేర్చుకుని ఆసియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా నిలిచింది.
Also Read: అంతా నీవల్లే: కోచ్ పై పాక్ కెప్టెన్ ఆగ్రహం
రాబోవు రోజుల్లో భారత ఆశాకిరణంగా తన్వీ ఎదుగుతోందని అందరూ అంటున్నారు. వచ్చే లాస్ యాంజిల్స్ ఒలింపిక్స్ లక్ష్యంగా తనని ప్రిపేర్ చేస్తున్నారు. ఈ విజయంతో ఒడిషాకు చెందిన తన్వి.. అండర్ -15 బాలికల చాంపియన్షిప్ గెలిచిన మూడో భారత షట్లర్గా నిలిచింది.
గతంలో సమియ ఇమాద్, తస్నిమ్ మిర్ ఈ ఘనత సాధించారు. ఈ టోర్నీ అండర్-17 బాలుర చాంపియన్షిప్లో తెలంగాణ అబ్బాయి జ్ఞానదత్తు కాంస్యం గెలుచుకున్న విషయం విదితమే.