Big shock for Gandra Venkataramana Reddy BRS leaders who will join the Congress: పదేళ్లు అధికారంలో ఉండి పెత్తనం చెలాయించిన బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లు తయారవుతుంది. ఒక్కసారి అధికారం దూరం కావడంతో ఆ పార్టీ నేతలకు ఎక్కడా లేని తిప్పలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా కీలక నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. గత్యంతరం లేక మిగిలి ఉన్న లీడర్ల తీరుతో పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో కనిపిస్తోంది. ఇన్నాళ్ళూ సైలెంట్ గా ఉన్న కార్యకర్తలు.. ఇప్పుడు మా కొద్దీ నాయకులు అని వారిమొహం మీదే చెప్పేస్తుండటం. గులాబీ పార్టీ దుస్థితికి అద్దం పడుతుంది.
ఒకప్పుడు బీఆర్ఎస్కి కంచుకోటగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఇప్పటికే జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి లాంటి దిగ్గజ నేతలు కేసీఆర్కి షాక్ ఇచ్చి పార్టీని వీడారు. పార్టీలో మిగిలి ఉన్న నేతలు అధికార కాంగ్రెస్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పార్టీ మారదామంటే ఎక్కడా గేట్లు తెరుచుకోక.. కారులోనే సవారీ చేస్తున్న కొందరు నేతలకు వారి పరిస్థితి ఏంటో వారికే అర్థం కాకుండా తయారవుతోందంట.
కొన్ని చోట్ల అలాంటి నేతలను పార్టీ నుంచి బయటకు వెళ్ళిపొండని సొంత పార్టీ క్యాడరే ఫైర్ అవుతోంది. భూపాలపల్లి జిల్లాలో అయితే మాకేం సహాయం చేశావ్, అంటూ సొంత క్యాడర్ బహిరంగంగానే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిని ప్రశ్నించడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో భూపాలపల్లి నియోజకవర్గం ఏర్పాటైంది. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుండి గండ్ర వెంకట రమణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో ఉద్యమ నేత సిరికొండ మధుసూదనాచారి గెలిచి స్పీకర్ గా విధులు నిర్వహించారు. 2018లో తిరిగి కాంగ్రెస్ పార్టీ నుండి గండ్ర వెంకటరమణారెడ్డి గెలిచి ఆ తర్వాత టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
అప్పట్లో గండ్ర వెంకటరమణారెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థి మధుసూదనాచారిని ఓడించి తిరిగి అదే పార్టీలో చేరడంతో వారిద్దరి మధ్య వర్గ పోరు మొదలైంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం గండ్ర వెంకటరమణారెడ్డి, మధుసూదనా చారి తీవ్రస్థాయిలో పోటీపడ్డారు. చివరకు వెంకటరమణారెడ్డికి టికెట్ దక్కడంతో మధుసూదనాచారి పార్టీ మారెందుకు సైతం సిద్దమయ్యారన్న వార్తలు వినిపించాయి. మరోవైపు మధుసుదనాచారి కుమారుడు ప్రశాంత్ బీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థిగా బరిలో ఉంటానని హడావుడి చేశారు. ఆ తర్వాత కేసీఆర్ బుజ్జగింపులతో సైలెంట్ అయినా.. మధుసూదనాచారి భూపాలపల్లిలో తన పొలిటికల్ యాక్టివిటీస్ పూర్తిగా తగ్గించేశారు.
మరోవైపు 2023 ఎన్నికల్లో గండ్ర వెంకరమణారెడ్డి దాదాపు 50 వేల పైచిలుకు ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధి గండ్ర సత్యనారాయణరావు చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ క్రమంలో భూపాలపల్లి బిఆర్ఎస్ కేడర్ గండ్ర వెంకటరమణారెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో కనిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ శ్రేణులను పట్టించుకోవట్లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న పదేళ్లు సొంత క్యాడర్ కు సైతం ఎలాంటి సహాయం చేయలేదని, ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసినట్లే తమను మోసం చేశారని బిఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
Also Read: కేటీఆర్ ప్లాన్ మామూలుగా లేదుగా.. 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి ?
దాంతో గండ్ర సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని టాక్ వినిపించింది. అయితే ఇటీవల రుణమాఫీ అంశంలో నిరసనలకు అధిష్టానం పిలుపునివ్వగా గండ్ర మళ్లీ రోడ్డెక్కారు. భూపాలపల్లి నియోజకవర్గం కేంద్రంలో కాకుండా, రేగొండలో పదిమందిని వెనకేసుకుని నిరసనకు దిగారు. ఆ ఆందోళన సందర్భంగా గండ్రకు సొంత పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. ధర్నాలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వద్దకు వెళ్లిన ఓ కార్యకర్త అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావంటూ సూటిగా ప్రశ్నించారు. ఇల్లు ఇస్తానని మాట ఇచ్చి కనీసం అది కూడా ఇవ్వలేదని ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే స్పందించిన పోలీసులు కార్యకర్తను అక్కడి నుంచి తీసుకెళ్లారు.
అధికారంలో ఉన్నప్పుడు తమ సమస్యలు పట్టించుకోలేదని, కనీసం తమను మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని గండ్రపై గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆయన వైఖరి కారణంగానే పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మిగిలి ఉన్న నేతలు సైతం గండ్ర తీరుతో దిక్కులు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మధుసూదనాచారి నియోజకవర్గంలో తమకు పెద్దదిక్కుగా ఉంటూ.. నిత్యం అందుబాటులో ఉండేవారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
అయితే గండ్ర పెత్తనం మొదలయ్యాక ఆ పరిస్థితి లేకుండా పోయిందని గులాబీ కేడర్ వాపోతుంది. అందుకే గండ్ర వెంకటరమణారెడ్డి ఎక్కడ కనిపిస్తే అక్కడ నిలదీయాలని గులాబీ కేడర్ ఫిక్స్ అయిందంటున్నారు. ఓవైపు అధిష్టానంపై అవినీతి ఆరోపణలు, మరో వైపు స్థానిక నాయకత్వం తీరుతో .. వారంతా తాము పార్టీ విడిచి వెళ్ళక తప్పదనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు … బుజ్జగించాల్సిన అధిష్టానమే పత్తా లేకుండా పోతే తాము ఇక పార్టీలో ఉండి ప్రయోజనం ఏంటని చర్చించుకుంటున్నారు … మొత్తానికి హస్తం నీడ నుంచి వెళ్లి కారెక్కిన గండ్ర వెంకటరమణారెడ్డి తన పొలిటికల్ కెరీర్కి తానే ఎండ్ కార్డ్ వేసుకున్నారన్న టాక్ వినిపిస్తుంది