Gunmen kill 23 bus passengers in Pakistan: పాకిస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది ఉగ్రవాదులు రెచ్చిపోయి ఏకంగా రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనాలను అడ్డగించి దాడులకు పాల్పడుతున్నారు. పంజాబ్ను బలూచిస్థాన్ కలిపే జాతీయ రాహదారిపై ఉగ్రవాదులు బస్సులు, ట్రక్కులు, వ్యాన్లను నిలిపివేస్తూ..అందరినీ తనిఖీ చేస్తూ కాల్పులు జరిపారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో 23 మంది మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.
ముసాఖెల్ జిల్లాలో రరాషమ్లోని జాతీయ రహదారిపై జరిగిన ఈ దాడిలో 23 మంది మృతి చెందగా..మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతోపాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. మొత్తం 10 వాహనాలకు నిప్పు పెట్టినట్లు సమాచారం. మృతుల్లో 20 మంది పంజాబీలు, ముగ్గురు బలూచీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు చెందిన ప్రయాణికులూ లక్ష్యంగా దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై బలూచిస్థాన్ సీఎం సర్పరాజ్ బుగ్టీ స్పందించారు. ఈ దాడి హేయమైన చర్య అని సీఎం తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read: ఉక్రెయిన్ పై రష్యా దాడులు..నలుగురి మృతి
అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఓ ఆటోమేటిక్ గన్తో ఉగ్రవాది బస్సును ఆపి కాల్పులు జరిపాడని పేర్కొంది. పక్కా ప్రణాళికతో మాటు వేసి ఉగ్రవాది ప్రయాణికులే లక్ష్యంగా దాడికి పాల్పడ్డాడు. బస్సులో ఉన్న ప్రయాణికులను కిందకు దించి మరి గన్ తో కాల్పులు జరిపాడు. కాగా, ఈ ఘటనపై అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.