Naveen Reddy: వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్రెడ్డిని ఎట్టకేళకు పట్టుకున్నారు పోలీసులు. మూడు రోజులుగా తప్పించుకు తిరుగుతున్న నవీన్ రెడ్డి.. గోవాలోని కాండోలిన్ బీచ్ లో ఉన్నట్టు గుర్తించారు. హైదరాబాద్ నుంచి గోవా వెళ్లిన పోలీస్ టీమ్.. నిందితుడిని అదుపులోకి తీసుకుంది.
ఆదిభట్ల పీఎస్ పరిధిలోని మన్నెగూడలో బీడీఎస్ స్టూడెంట్ వైశాలి ఇంటిపై 100 మంది అనుచరులతో దాడి చేసిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది. మిస్టర్ టీ యజమాని నవీన్ రెడ్డి.. వైశాలిని ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లడం.. ఇంటిని ధ్వంసం చేయడం, ఆమె కుటుంబ సభ్యులను కొట్టడం.. సంచలనంగా మారింది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగినా.. నిందితుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు.
దృశ్యం మూవీ తరహాలో.. నవీన్ రెడ్డి తన సెల్ ఫోన్ ను విజయవాడ వైపు వెళ్తున్న వాహనంలో పంపించి.. పోలీసులను డైవర్ట్ చేశాడు. వైశాలిని కారులో నాగార్జున సాగర్ వైపు తీసుకెళ్లాడు. అయితే, మీడియాలో జరుగుతున్న హడావుడి చూసి బెదిరిపోయాడు. తన స్నేహితుడితో వైశాలిని తిరిగి హైదరాబాద్ పంపించేశాడు. ఆమె క్షేమంగా ఇంటికి చేరింది. నవీన్ రెడ్డి తనను ఎలా వేధించింది చెప్పుకొచ్చింది.
అప్పటి నుంచీ నవీన్ రెడ్డి ఎస్కేప్ లో ఉన్నాడు. స్పెషల్ టీమ్స్ అతని కోసం గాలించగా.. మూడు రోజుల తర్వాత గోవాలో చిక్కాడు. నవీన్ రెడ్డిపై హత్యాయత్నం, కిడ్నాప్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు.
మరోవైపు, పోలీసులకు పట్టుబడే ముందు నవీన్ రెడ్డి ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. అందులో, తాను వైశాలి ఇంటిపై దాడి చేయడం తప్పేనంటూ ఒప్పుకుంటూనే.. అసలు తానలా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు. తప్పంతా వైశాలీదే అన్నట్టు.. ఆమె తనను ప్రేమ పేరుతో మోసం చేసిందంటూ.. ఆరోపించాడు. తన తల్లిదండ్రులు బాధపడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.