Indian Fruit Flies In Space| మానవుడు టెక్నాలజీ రంగంలో ఎంతో అభివృద్ధి చెందాడు. తనకు ఎదురయ్యే ఎంత పెద్ద సమస్య అయినా పరిశోధన చేసి పరిష్కరించే స్థాయికి ఎదిగాడు. ఈ కోవలో తాజాగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఒక కొత్త ప్రయోగం చేయబోతోంది. 2025లో తలపెట్ట బోయే ‘గగన్ మిషన్’ లో భాగంగా ఈగలను అంతరిక్షంలోకి పంపనుంది.
ఈ ఈగలకు ఒక ప్రత్యేకత ఉంది. మానవ శరీరాకృతి పోలికలతో ఈ ప్రత్యేక ఈగల శరీరం ఉండడంతో వీటిని అంతరిక్షలోకి ప్రవేశ పెట్టి.. అక్కడ జీరో గ్రావిటీ (భూ ఆకర్షణ లేని) ప్రదేశంలో వీటిపై అధ్యయనం చేయనున్నారు. కర్ణాటకకు చెందిన ధార్వాడ్ వ్యవసాయ యూనివర్సిటీ ఈ ప్రత్యేక ఈగలు పంపిణీ చేస్తోంది. ఈ ఈగలను మీరు కూడా చూసే ఉంటారు. సాధారణంగా ఇళ్లలో కుళ్లిపోయిన పళ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలపై సన్నటి ఈగలు వాలుతూ ఉంటాయి. వీటిని ఫ్రూట్ ఫ్లైస్ అని అంటారు.
అయితే ఈ ఫ్రూట్ ఫ్లైస్ కూడా ఆరోగ్యవంతమైన లక్షణాలు ఉండే విధంగా 75 వ్యవసాయ యూనివర్సిటీల పంపిన సాంపిల్స్ నుంచి ఎంపిక చేయడం జరిగింది. ఈ శాంపిల్స్ అన్నింటిలో ధార్వాడ్ యూనివర్సిటీ పంపించిన ఈగలు ఆరోగ్యవంతంగా ఉండడంతో వాటిని ఇస్రో ఎంపిక చేసింది. పైగా ఈ ఈగలను తీసుకెళ్లే కిట్ ను కూడా ధార్వాడ్ యూనివర్సిటీ నే తయారు చేసింది.
ధార్వాడ్ వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రవికుమార్ హోసామనికి ఈ అంతరిక్ష ప్రయోగానికి ఈగలు పంపిణీ చేస్తున్నందుకు శాస్త్రవేత్తల ప్రశంసలందుకున్నారు. ధార్వాడ్ యూనివర్సిటీ దేశంలోని టాప్ 10 అగ్రికల్చర్ యూనివర్సిటీలలో ఒకటి.
కేరళ, తిరువనంతపురంలో ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తయారు చేసిన ఓ ప్రత్యేక కిట్ లో ఈ ఈగలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రత్యేక కిట్ ఆహారంగా గోధుమ రవ్వ, బెల్లం, సోడియమ్ ఆక్సలేట్ పదార్థాలు నిలువ చేస్తారు. ఈ ప్రత్యేక కిట్ తయారీ ఖర్చు రూ.78 లక్షలు అని సమాచారం.
అంతరిక్షంలో ప్రయాణం చేసేందుకు ప్రత్యేకంగా 20 ఈగలను ఎంపిక చేస్తారు. వీటిలో పది మగజాతికి చెందిన ఈగలు కాగా మరో పది ఆడజాతికి చెందినవి. మానవ శరీరానికి 70 శాతం పోలీకలున్న ఈ ఈగలు అంతరిక్షంలో ప్రయాణించినప్పుడు వాటికి ఏ ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిని ఎలా అధిగమించాలనే కోణంలో పరిశోధనలు సాగుతాయి.
సాధారణంగా అంతరిక్షంలో ప్రయాణించే వ్యోమగాములకు ఎముకల బలహీనత, కిడ్నీలో రాళ్లు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఈ ప్రత్యేక ఈగలకు కిడ్నీ సమస్యలు వస్తాయని ఇంతకు ముందు చేసిన పరిశోధనల్లో తేలింది.
2025లో ఇస్రో అంతరిక్షంలోకి పంపే స్పేస్ క్రాఫ్ట్ లో వ్యోమగాములతో పాటు ఈ ఈగలున్న కిట్ ని కూడా పంపుతారు. ఈ స్పేష్ క్రాఫ్ట్.. అంతరిక్షంలో భూమి చుట్టూ రెండు నుంచి ఏడు రోజులపాటు తిరుగుతూ చివరికి గుజరాత్ సమీపంలోని సముద్రం వద్ద భూమిపై దిగుతుంది.
Also Read: అంతరిక్షంలో చిక్కుకున్న ఆస్ట్రోనాట్స్ ని తీసుకురాబోతున్న ఇలాన్ మస్క్.. నాసా ప్రకటన!