KCR BRS: ఏపీలోనూ బీఆర్ఎస్(BRS). ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. జాతీయ పార్టీ, దేశమంతా విస్తరిస్తాం అన్నాక.. ఎలాగూ ఆంధ్రప్రదేశ్ లోనూ పార్టీ ఉంటుందిగా. అప్పుడే విజయవాడ సమీపంలో బీఆర్ఎస్(BRS) కార్యాలయ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు, మాజీ సీబీఐ జేడీ లక్ష్మినారాయణతో చర్చలకూ సిద్ధమవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ వెటరన్ లీడర్ ఉండవల్లితోనూ కేసీఆర్(KCR) మిలాఖత్ జరిగింది. ఈ లెక్కన ఏపీలో బీఆర్ఎస్(BRS) ఉనికి చాటేందుకు కేసీఆర్ ముందునుంచే వ్యూహాలు రెడీ చేసుకున్నారని తెలుస్తోంది. ఇదంతా ఓకే గానీ.. కేసీఆర్(KCR)ను ఏపీ వాసులు ఆదరిస్తారా? పాత మాటలను, పాత గాయాలను మరిచి.. కొత్తగా వెల్ కమ్ చెబుతారా?
విజయవాడలో పార్టీ ఆఫీసునే కట్టబోతున్నారంటే.. సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టే. మరి, కేసీఆర్లో అంత ధీమా ఏంటి? ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రజలను నోటికొచ్చినట్టు విమర్శించి, పలుమార్లు తిట్టి.. రెచ్చగొట్టి.. నానారకాలుగా అబాసుపాలు జేసి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల కోసం వస్తే ప్రజలు ఓకే చెబుతారా? ఆనాటి మాటలను మర్చిపోతారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
గతం గత: వర్తమానంలో ఏంటనేదే కేసీఆర్(KCR) లెక్క. తొమ్మిదేళ్లుగా తెలంగాణలో సుపరిపాలన అందిస్తున్నామని.. ఏపీకంటే ఎన్నోరెట్లు ఎక్కువగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నామనేది కేసీఆర్ భావన. పథకాలు, ప్రాజెక్టులు, పవర్ లాంటి విషయాల్లో తెలుగు ప్రజలందరి మనసు గెలుచుకున్నామని.. అవే ఇప్పుడు ఏపీలో తనకు ఆదరణ తీసుకొస్తాయనేది ఆయన అంచనా. ఇలాంటి లెక్కలతోనే ఏపీలో గులాబీ జెండా ఎగరేస్తారని చెబుతున్నారు.
పక్కా పొలిటికల్ పంథాలో కాకుండా.. బీఆర్ఎస్(BRS)ను ఆప్ తరహా మిస్టర్ క్లీన్ ఫేసెస్ తో నడిపించాలని చూస్తున్నారు. అందుకే, మేథావులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు, సామాజిక ప్రముఖులకు అధిక ప్రాధాన్యం ఇవ్వబోతున్నారని అంటున్నారు. ప్రకాశ్ రాజ్ లాంటి వారిని తన పక్కన పెట్టుకున్నారని చెబుతున్నారు. ఏపీలో జనసేన మాజీ నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణను చర్చలకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉండవల్లితో ఓ దఫా మీటింగ్ జరిగింది. వాళ్లిద్దరూ ఓకే అంటే ఏపీలో స్మూత్ గా ముందుకు పోవచ్చనేది కేసీఆర్(KCR) ఆలోచన. కానీ, వారిద్దరూ బీఆర్ఎస్(BRS)కు జై కొట్టే పరిస్థితుల్లో లేరని అంటున్నారు.
అటు, విజయవాడలో బీఆర్ఎస్(BRS) కార్యాలయ బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కట్టబెట్టారు కేసీఆర్(KCR). దానివెనకా ఓ లెక్కుందని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. చంద్రబాబును ఓడించేలా, జగన్ కు సహకరించేలా.. తలసానినే ముందుంచారు. ఏపీలో తలసాని సామాజిక వర్గానికి చెందిన వారి సంఖ్య అధికం. అందుకే తలసానితో డీల్ చేయిస్తున్నారని చెబుతున్నారు.
ఇక, కేసీఆర్(KCR) పూర్వికులు ఉత్తరాంధ్ర నుంచి వలసొచ్చారనే ఆరోపణ ఎప్పటినుంచో ఉంది. ఆ ప్రాంతంలో కేసీఆర్(KCR) సామాజిక వర్గం బలంగా ఉంది. కాస్త ఉనికి చాటుకుంటే.. వారంతా బీఆర్ఎస్(BRS)కు మద్దతుదారులుగా నిలుస్తారనేది గులాబీ బాస్ అంచనా.
వాళ్లు వీళ్లతో పనేముంది. జగన్, కేసీఆర్(KCR) రహస్య స్నేహితులనే అనుమానం ఎప్పటి నుంచో ఉంది. అయితే, ఎవరి రాష్ట్రం వారిదే అయినప్పుడు ఫ్రెండ్ షిప్ ఉంటుందేమో కానీ, మీ ఇంటికొచ్చి మీ మీదనే పోటీ అంటే మాత్రం ఎవరైనా సహకరిస్తారా? అందుకే, సజ్జల సైతం బీఆర్ఎస్ పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సెలవిచ్చారేమో. ఒకవేళ బీఆర్ఎస్(BRS) ఏపీ బరిలో దిగితే.. ప్రతిపక్షాల ఓట్లను చీలుస్తుందనే నమ్మకం కుదిరితే.. అప్పుడు వైసీపీ స్టాండ్ ఇంకోలా ఉండొచ్చు.
ఇక, పవన్ కల్యాణ్ కు సైతం కేసీఆర్(KCR) కుటుంబంతో మంచి దోస్తానా ఉంది. కాకపోతే జనసేనాని ప్రస్తుతం బీజేపీతో కలిసున్నారు. అందుకే, బీఆర్ఎస్(BRS)పై పవన్ స్టాండ్ ఏంటనేది మరింత ఆసక్తికరం. ఇలా ఎలా చూసినా.. ఏపీలో బీఆర్ఎస్(BRS) విస్తరణ అంతా కన్ఫ్యూజన్ తో కూడుకున్నదే. ఫలితం ఆశించకుండా.. ఏదిఏమైనా.. దూకుడుగా వెళ్లడమే గులాబీ బాస్ వ్యూహంలా కనిపిస్తోంది.