Telangana Cyber crime 175 Crore Fraud Case: హైదరాబాద్ కేంద్రంగా జరిగిన భారీ సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. పాతబస్తీ అడ్డాగా క్రిప్టో కరెన్సీ ద్వారా సైబర్ నేరగాళ్లు రూ.175కోట్ల అక్రమ లావాదేవీలు జరిపారు. ఈ భారీ స్కామ్ షంషీర్ గంజ్లో బయటపడింది. సైబర్ నేరగాళ్లకు సహకరించిన ఇద్దరు ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరా ప్రకారం.. మహ్మద్ షూబ్ తౌకీర్, మహ్మద్ బిన్ అహ్మద్ బవాజీర్ ఇద్దరూ ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ షంషీర్ గంజ్లోని జాతీయ బ్యాంక్లో 6 బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేశారు. వారి ద్వారా రూ.175కోట్ల లావాదేవీలు సైబర్ కేటుగాళ్లు జరిపారు. దీంతో ఆయా లావాదేవీలపై అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆ అకౌంట్లు ఫేక్ అని తేల్చారు. ఈ అకౌంట్ల నుంచి భారీగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితులు కొంతమంది పేదల పేరుతో అకౌంట్లు తెరిచి సైబర్ నేరాలకు పాల్పడినట్లు ఆధారాలు సేకరించారు. వివిధ బ్యాంకుల ఖాతాదారుల నుంచి పెద్ద ఎత్తున ఈ ఫేక్ అకౌంట్లకు మనీ ట్రాన్స్ ఫర్ అయినట్లు గుర్తించారు.
దాదాపు 600 కంపెనీలకు అకౌంట్లను లింక్ చేసిన సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ నుంచి దుబాయ్, ఇండోనేషియా, కంబోడియాలకు డబ్బులు బదిలీ చేశారని, క్రిప్టో కరెన్సీ ద్వారానే నిధులు ట్రాన్స్ ఫర్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. సైబర్ నేరగాళ్లు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఆటో డ్రైవర్లు ఇద్దరూ ఈ పనులకు అంగీకరించినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు.
Also Read: బెంగుళూరు సెంట్రల్ జైలులో హీరో దర్శన్ ఎంజాయ్, విచారణకు ఆదేశం
అయితే, ఈ హవాలా, మనీలాండరింగ్ ద్వారా డబ్బుల లావాదేవీలు జరపగా..దీని వెనుక చైనా సైబర్ నేరగాళ్ల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇద్దరు ఆటో డ్రైవర్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది. దీనిపై మరింత సమాచారం కోసం విచారిస్తున్నారు.