– హైడ్రా కూల్చివేతలు సూపర్
– కబ్జా ఎవరు చేసినా వదలొద్దు
– అనుమతులు ఇచ్చిన వారిపైనా చర్యలుండాలి
– నాగార్జున సత్యహరిశ్చంద్రుడు కాదు
– ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆయనకు పెద్ద లెక్క కాదు
– సీపీఐ నారాయణ విమర్శలు
HYDRA: హైడ్రా కూల్చివేతలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ‘‘పేదలు గజం స్థలం ఆక్రమిస్తేనే నానా రాద్ధాంతం చేస్తారు. నాగార్జున బిగ్ బాస్కే బాస్. చెరువును ఆక్రమించుకుని కబ్జాలు చేశారు. ఆయనేం సత్యహరిశ్చంద్రుడు కాదు. ఎన్ కన్వెన్షన్ మీద రోజుకు రూ.లక్షల ఆదాయం సంపాదించారు. ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. అందువల్ల నాగార్జునకు ఇదంతా పెద్ద లెక్క కాదు. సినిమా డైలాగులు పనికిరావు. ఒక్కడే కూర్చొని వందమందిని కొట్టేస్తే నడవదు. రోజుకు ఎంత సంపాదించాడో అదంతా కక్కించాలి’’ అని అన్నారు.
Also Read: HYDRA: 9 నెలలుగా నాపై వేధింపులు పెరిగాయి.. నా భూమిలోనే నిర్మించా: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా చెరువుల్లో కాలేజీలు కట్టారని, వారంతా కబ్జాకోరులు అంటూ విమర్శించారు నారాయణ. ‘‘ఫిరంగి నాలాను కబ్జా చేశారు. చెరువులు, నాలాలు కబ్జా అయితే ఊర్లు మునిగిపోతాయి. ఆరంభ శూరత్వం కాదు. ఎక్కడ కబ్జా జరిగినా ఖాళీ చేయించాలి. పెద్దలు కబ్జాలు చేసినా, దొంగ పట్టాలు పొందినా వారి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. రాజకీయ కక్ష సాధింపు అవసరం లేదు. ఒకే పార్టీ, ఒకే వర్గం మీద కక్ష సాధింపు అనేది మంచిది కాదు. ఎవరు ఆక్రమించినా కూడా వాటిని హైడ్రా కూల్చివేయాలి. ఈ కూల్చివేతలు ఇలాగే కంటిన్యూ కావాలి. అదేవిధంగా ఈ అక్రమ నిర్మాణాలకు ఎవరు అనుమతిచ్చారో వారిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మేం మొదటి నుంచి భూ సమస్యలపైనే పోరాటం చేస్తున్నాం’’ అంటూ వ్యాఖ్యానించారు నారాయణ.