CM Revanth Reddy Comments: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గచ్చిబౌలిలో నిర్వహించిన బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ద్విదశాబద్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ మార్గంలోనే బ్రహ్మకుమారీస్ నడుస్తున్నారని, డ్రగ్స్ నిర్మూలనకు వారు ఎంతగానో కృషి చేస్తున్నారంటూ ఆయన పేర్కొన్నారు. బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో శాంతి సరోవర్ హైదరాబాద్ లో ఉండడం ఆనందంగా ఉందంటూ సీఎం అన్నారు. రాష్ట్రంలో గోల్కొండ, చార్మినార్, శంషాబాద్ ఎయిర్ పోర్టు ఉన్నట్లు బ్రహ్మకుమారీస్ ఉన్నారని చెప్పుకోవాలన్నారు. రైతులను రుణ విముక్తులను చేసేందుకు, డ్రగ్స్ నుంచి విముక్తి కలిగించి యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని కృషి చేస్తున్నామంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. తన కార్యాచరణను ప్రజలు గమనిస్తూనే ఉన్నారంటూ సీఎం స్పష్టం చేశారు.
Also Read: కూలిన నిర్మాణాలు.. నిధులు నీళ్లపాలు..! పదేళ్ల ప్రభుత్వ నిర్మాణాల వైఫల్యాలపై స్పెషల్ స్టోరీ
ఒకే విడతలో రైతులకు భారీగా రుణాలను మాఫీ చేస్తున్నామన్నారు. దేశంలో ఈ విధంగా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదన్నారు. డ్రగ్స్, మత్తుకు అలవాటు పడి యువత తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, ఈ నేపథ్యంలోనే డ్రగ్స నుంచి యువతను రక్షించేందుకు తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదన్నారు. తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిన డ్రగ్స్ మూలలను ఏరివేస్తున్నామన్నారు. త్వరలోనే ప్రారంభించబోయే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతలో నైపుణ్యాలను పెంచుతామన్నారు.