Chandrababu meeting with Telangana TDP Leaders: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే తెలంగాణ టీడీపీ నాయకులతో చర్చలు జరిపిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. నేడు కూడా నగరంలోని ఎన్టీఆర్ భవన్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో ఆయన చర్చించారు.
అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలంటూ ఆయన పార్టీ నాయకులకు సూచించారు. పనితీరు బాగున్నవారికే పార్టీలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలంటూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని కమిటీలను ఆయన రద్దు చేశారు. ముఖ్యంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై చంద్రబాబు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఆయనేం సత్యహరిశ్చంద్రుడు కాదు.. కూల్చివేతలను కంటిన్యూ చేయాలి: నారాయణ
సమావేశం సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆన్ లైన్ లో పార్టీ సభ్యత్వం తీసుకునే ఏర్పాట్లు చేస్తామన్నారు. పార్టీలోని పదవుల్లో యువతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. వీలైతే 15 రోజులకు ఒకసారి తెలంగాణకు వచ్చేందుకు ప్రయత్నిస్తానని, అందరినీ కలిసి అభిప్రాయాలు తీసుకుంటానంటూ ఆయన స్పష్టం చేశారు.