Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తున్నది. అక్రమ కట్టడాలను వరుసగా కూల్చివేస్తున్నది. తిమ్మిడికుంట ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మించిన నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను నిన్న ఉదయం కూల్చివేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఇకపైనా కూడా ఇలాంటి అక్రమ కట్టడాలను కూల్చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. చెరువు, కుంటలను కాపాడుతామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్లోని నిర్మాణాలు అన్నింటిని కూల్చేస్తామనడం సరికాదని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఆ పరిధుల్లో ప్రైవేటు కట్టడాలతోపాటు ప్రభుత్వ నిర్మాణాలు కూడా ఉన్నాయని చెప్పారు. మరి వాటిని కూడా కూల్చేస్తారా? అని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్డు పరిస్థితి ఏమిటీ? తొలగిస్తారా? అని అడిగారు. జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూల్చేస్తారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఉన్న చోట గతంలో ఓ కుంట ఉండేదని వివరించారు. ఉస్మాన్ సాగర్ వద్ద ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఎంబీ ఉన్నదని, దాన్ని కూడా కూల్చేస్తారా? అని అడిగారు.
ఇక హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు పేదలను భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయన్నారు. తాను అద్భుత పాలకుడినని, ఆయన నిక్కచ్చిగా ఉండే ఆఫీసర్ అని చూపించే ప్రయత్నాలు చేస్తున్నారా అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తన గుర్తింపు కోసం హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా కేసీఆర్ సీఎం అయ్యాక అయ్యప్ప సొసైటీలోని కొన్ని నిర్మాణాలను కూల్చేశారని, కానీ, ఆ తర్వాత నాలుగు రోజులకే ఆయన తోకముడిచారని చెప్పారు. ఏం జరిగిందో ప్రజలు చూశారని తెలిపారు.
Also Read: HYDRAA: హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వానికి స్టేటస్ రిపోర్ట్.. 43 ఎకరాల్లో కూల్చివేతలు
ఇలాంటివన్ని ఒక పద్ధతి ప్రకారం జరగాలని, అసలు ఈ నిర్మాణాలకు ఎందుకు అనుమతి ఇచ్చారని ఈటల ప్రశ్నించారు. ఏ కలెక్టర్, ఏ ఉడా అధికారి, జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చిందని అడిగారు. రేవంత్ రెడ్డి వచ్చాకే కాంగ్రెస్ పుట్టలేదని, ఇప్పుడు ఇంత హడావుడి చేసి భయాందోళనలు సృష్టించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ముంటే.. హైదరాబాద్లో ప్రభుత్వం ఎన్ని కుంటలు పూడ్చేసింది? ప్రభుత్వం ఎన్ని నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది? ఈ వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద పెద్దవాళ్లవి కూల్చేయడాన్ని తాను తప్పుపట్టడం లేదని, కానీ, పేద ప్రజలవి కూల్చేయ వద్దని పేర్కొన్నారు.
నిన్న ఉదయం మాదాపూర్లోని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా, టౌన్ ప్లానింగ్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు కూల్చేశారు. ఈ కన్వెన్షన్ తిమ్మిడి కుంట చెరువును ఆనుకునే ఉన్నది. చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లోని మూడెకరాలకుపైగా భూమిని ఈ కన్వెన్షన్ కోసం కబ్జా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో జీహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసుల ఆధారంగానే హైడ్రా అధికారులు నిన్న యాక్షన్ తీసుకుంది.