Story of N-Convention Demolition : N-కన్వెన్షన్.. హైడ్రా దూకుడు ముందు నిలవలేకపోయింది. తమ దూకుడు మాటల్లోనే కాదు.. చేతల్లో ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి ప్రూవ్ చేశారు. తెల్లవారుజామున మొదలైన కూల్చివేతలు.. గంటల్లోనే ముగిశాయి. ఇప్పుడు దీని గురించి కాదు మనం డిస్కస్ చేసేది. N కన్వెన్షన్ వెనక అసలు కథ గురించి మనం మాట్లాడుకుందాం.
ఎన్నో వేడుకలు, పెళ్లీళ్లు, ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు వేదికైన N కన్వెన్షన్ కూలిపోయింది. ఎందుకో ఇప్పటికే మీకు అర్థమైంది కదా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా క్లియర్కట్గా చెప్తూ వస్తున్నారు. ఆక్రమణలను సహించేది లేదని.. ఇప్పుడు అన్నట్టుగానే చేశారు. తమ్మిడికుంట చెరువు FTL, బఫర్ జోన్లో N-కన్వెన్షన్ ను నిర్మించారు. దీనిపై ఇప్పుడు కాదు ఏళ్ల నుంచి వివాదం నడుస్తూనే ఉంది. కోర్టులో పిటిషన్లు, స్టేలు ఇలా కథ కంచికి చేరకుండా సాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు దీనిని ఫుల్ స్టాప్ పెట్టింది హైడ్రా.
అయితే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున రియాక్ట్ అయ్యారు. ఎన్ కన్వెన్షన్ భూమి పట్టా భూమి అని, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా ఇచ్చింది. కూల్చివేత తప్పుడు సమాచారంతో.. చట్ట విరుద్ధంగా జరిగిందన్నారు నాగార్జున. దీనిపై ఆయన వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. హౌస్ మోషన్ పిటిషన్ వేశారు.. స్టే తెచ్చుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగపోయింది.. ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టమైంది.
Also Read: మనల్ని ఎవడ్రా ఆపేది..!.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. పూర్వపరాలు
కానీ నాగార్జున ఇక్కడో లాజిక్ మిస్ అవుతున్నారు. పక్కనే చెరువు ఉంది.. కంటికి కనిపిస్తోంది. అలాంటి చెరువులో నిజంగా భూమి మీదైనా.. FTL పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని తెలియదా? ఇన్ని విషయాలు తెలిసి కూడా FTL, బఫర్ జోన్లోనే N-కన్వెన్షన్ ను నిర్మించేశారు. చెరువులోనే మీ కన్వెన్షన్ ఉన్నట్టు క్లియర్ కట్గా తెలిసిపోతుంది కదా.
ఇది నిర్మించి ఇప్పటికే పదేళ్లు దాటిపోయింది. ఈ పదేళ్లలో దీనిపై బాగానే వెనకేశారనే చెప్పాలి. N కన్వెన్షన్లో మూడు హాల్స్ ఉన్నాయి. ఇందులో మొదటి హాల్ కెపాసిటీ.. 2000 సిట్టింగ్. మరో మూడు వేల మందికి ఫ్లోటింగ్కు అవకాశం ఉంది. అంటే అటు ఇటుగా మొత్తం ఐదు వేల మంది వేసుకోవచ్చు. సెకండ్ హాల్ సిట్టింగ్ అండ్ ఫ్లోటింగ్ కలిపి 1200 మంది వరకు ఉంటుంది. థర్డ్ హాల్ సిట్టింగ్ అండ్ ఫ్లోటింగ్ కలిపి 2 వేల 200 మంది వరకు ఉండొచ్చు. మొత్తంగా చూస్తే.. 10 వేల మంది వరకు ఒకేసారి హ్యాండిల్ చేయగలదు ఎన్ కన్వెన్షన్.
మరి ఇందులో ఓ ఈవెంట్ను నిర్వహించాలంటే భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక గెస్ట్కు సర్వ్ చేసే ప్లేట్ ఖరీదు అక్షరాలా 16 వందల రూపాయలు ఉంటుంది. అదే నాన్వేజ్ అయితే 1800 వరకు చార్జ్ చేస్తారు. అంటే ఒక రోజుకు అటు ఇటుగా కోటి 70 లక్షల నుంచి 2 కోట్ల వరకు చార్జ్ చేస్తారు. దీనికి లైటింగ్, పార్కింగ్ అదనం.. అవి మనం ఇక్కడ ఇన్క్లూడ్ చేయడం లేదు. మళ్లీ ఏడాదికి సగం రోజులు ఏదో ఒక ఈవెంట్ నడుస్తూనే ఉంటుంది ఈ కన్వెన్షన్లో.. ఇవన్నీ లెక్కలేసి చూసే ఈ పదేళ్లలో 3 వేల నుంచి 4 వేల కోట్ల వరకు ఎన్ కన్వెన్షన్ సంపాదన ఇచ్చింది. ఇందులో సగానికి సగం ఖర్చులకు పోయినా.. పదిహేను వందల నుంచి 2 వేల కోట్ల వరకు సంపాదించారు ఓనర్లు. అందుకే కూల్చివేతకు అయిన ఖర్చులు కూడా కన్వెన్షన్ ఓనర్ల నుంచే వసూలు చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
ఈ కట్టడం సక్రమం కాదు.. అక్రమమని ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఏనాడో చెప్పారు. ప్రజలకు ఆదర్శంగా ఉండే హిరోలు అక్రమాలు చేయవద్దన్నారు. కానీ ఇది సాకారం కావడానికి ఇన్నేళ్లు పట్టింది. ఎక్స్ ట్రా ఒక్క అంగుళం కూడా ఆక్రమించి కట్టలేదు. హైకోర్టు స్టే విధించింది.. అసలు అక్రమం అని తేలితే నేనే కూల్చేసేవాడిని. ఇలా అనేక డైలాగ్స్తో నాగార్జున చేసిన ట్వీట్పై రియాక్ట్ అయ్యింది హైడ్రా. అసలు కూల్చివేతలు ఎందుకు చేపట్టామన్నది క్లియర్కట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. 2014లోనే తమ్మిడికుంట FTL, బఫర్జోన్పై HMDA ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత అంటే 2016లో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది HMDA. 2014లో నోటిఫికేషన్పై.. N-కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలమేరకే N-కన్వెన్షన్ యాజమాన్యం సమక్షంలో.. FTL సర్వేను HMDA నిర్వహించింది. దానిపై 2017లో N-కన్వెన్షన్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు ఇప్పటికీ పెండింగ్లో ఉంది.. అంతేకాని ఎలాంటి స్టే ఆర్డర్ను కోర్టు ఇవ్వలేదు. ఇదీ హైడ్రా ఇచ్చిన వివరణ. అంతేకాదు దీనిపై ఇంత వ్యవహారం నడుస్తున్నా.. కమర్షియల్గా ఆ కన్వెన్షన్ను వాడుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం కన్వెన్షన్కు GHMC కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఇదీ ఎన్ కన్వెన్షన్ కథ.
అయితే ప్రస్తుతం హైకోర్టు అయితే స్టే ఇచ్చింది. కానీ.. హైడ్రా అప్పటికే తన టార్గెట్కు రీచ్ అయ్యింది. కానీ ఎలాంటి అనుమతులు లేని కన్వెన్షన్కు పవర్ సప్లై ఎలా వచ్చింది? ఇన్ని రోజులు ఎలా కమర్షియల్గా ఆ ప్లేస్ను ఉపయోగించారు? సిటీలో ఇంకా ఇలాంటి కట్టడాలు ఎన్ని ఉన్నాయి? అనే దానిపై హైడ్రా ఫోకస్ చేయాలి. అసలు హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఏంటన్నది చూడాల్సి ఉంది. హైదరాబాద్లో ఎన్ కన్వెన్షన్ లాంటి నిర్మాణాలు అనేకం ఉన్నాయి. మరి హైడ్రా వెహికల్స్ ఏ కట్టడంపైకి దూసుకుపోనున్నాయి.. ? దేన్ని నేలమట్టం చేయనున్నాయి? అనేది ఇప్పుడు అర్థంకాని పరిస్థితి. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు పనిచేయడం లేదు. ఎవరి రికమండేషన్లను హైడ్రా పట్టించుకోవడం లేదు. అందుకే ఇప్పుడు హైడ్రా పేరు వింటనే కొందరికి భయం మొదలైంది. నిజానికి ఇదంతా మంచికే అని చెప్పాలి. మెరుగైన భాగ్యనగరం కోసం ఇలాంటివి తప్పదు.