Harish Rao Fire on Congress Govt: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేలా సీఎం రేవంత్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైడ్రా పేరుతో రాత్రికి రాత్రే కూల్చివేతలు చేస్తున్నారని హరీష్ రావు విమర్శలు చేశారు. మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై రాజకీయ కుట్రతోనే ఆరు కేసులు నమోదు చేశారన్నారు. అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుమతులు తీసుకొనే కాలేజీలను నిర్మించారని, కానీ అక్రమంగా నిర్మించారని నోటీసులు ఇస్తున్నారన్నారు.
కాంగ్రెస్ కండువా కప్పుకోండి.. లేదంటే టార్గెట్ చేస్తామనేలా కాంగ్రెస్ పనిచేస్తుందని విమర్శించారు. ప్రతిపక్షాల నాయకులను రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీయాలని రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. హైడ్రాను కేవలం రాజకీక కక్ష్య సాధింపులకు మాత్రమే వాడుకుంటుందని ఆరోపించారు.
Also Read: ప్రైవేట్ బస్సు బోల్తా.. 30మందికి గాయాలు
హైడ్రాకు తాను వ్యతిరేకం కాదని, నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని హితవు పలికారు. అలాగే తమ పార్టీ ఎమ్మెల్యేల కాలేజీలకు తప్పా మిగతా కాలేజీలకు సీట్లు పెంచలేదన్నారు. కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు.