Hydra send Notices to 225 illegal villas in Chitrapuri colony : హైదరాబాద్ మహా నగరంలో కబ్జాలకు గురవుతున్న చెరువులు,కుంటల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా తన ప్రతాపం చూపిస్తోంది. ముందుగా సామాన్య, మధ్య తరగతి నుండి కాకుండా ఏకంగా పేరు మోసిన బడా సంస్థల సెలబ్రిటీల నుంచే కూల్చివేతలు మొదలుపెట్టారు. ఇప్పటికే సినీ నటుడు నాగార్జునకు సంబంధించి మాదాపూర్ లో ఉన్న ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన హైడ్రా అధికారులు మరింత మంది పొలిటికల్, సినీ సెలబ్రిటీల ఆక్రమణలపై దూకుడు పెంచారు. అనుమతులు లేకుండా బఫర్ జోన్ లో చెరువులను ఆక్రమించుకుని కట్టుకున్న బడా సెలబ్రిటీల ఇళ్లకు నోటీసులు ఇచ్చే పనిలో హైడ్రా బిజీగా ఉంది. దీనితో పొలిటికల్, సినీ, బిజినెస్ సెలబ్రిటీలు టెన్షన్ లో ఉన్నారు. ఇప్పటికే మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డిపై హైడ్రా అధికారులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
చిత్రపురి కాలనీపై దృష్టి
మణికొండ పరిధిలోని చిత్రపురి కాలనీలో నిర్మించిన దాదాపు రెండు వందల ఇరవై ఐదు విల్లాలను జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. అవన్నీ కూడా అనుమతులు లేకుండా అక్రమంగా చెరువు స్థలాలలో కట్టుకున్నవి కావడంతో వీరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అప్పట్లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 658కి వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలు చేసుకున్నారని వారందరినీ నోటీసులు ఇవ్వడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. పైగా జీ ప్లస్1 అంటూ అనుమతులు తీసుకుని వాటిని జీ ప్లస్ 2 గా నిర్మాణాలు అక్రమంగా చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు. దీనిపై రెండువారాలలోగా తమ నోటీసులకు రిప్లై ఇవ్వాలని విల్లాల యజమానులకు నోటీసులో తెలియజేశారు. బీఆర్ఎస్ హయాంలో చిత్రపురి కాలనీలో అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేశారని.. దాని వలన రూ.50 కోట్ల మేరకు నష్టం జరిగిందని కాలనీ వాసులు చెబుతున్నారు.
225 విల్లాలకు నోటీసులు
కాలనీ వాసుల ఫిర్యాదుపై స్సందించిన జీహెచ్ఎంసీ కమిషనర్ అక్రమంగా నిర్మించిన రెండు వందల ఇరవై ఐదు విల్లాలకు నోటీసులు జారీ చేశారు. మహా నగర పరిధిలో చెరువులు దాదాపు 920 ఉన్నాయి. వీటిలో దాదాపు 500 చెరువులు కబ్జాకు గురయ్యాయి 200కు పైగా చెరువులలో అక్రమ నిర్మాణాలు చేయడం జరిగింది. అక్రమ నిర్మాణాలతో చెరువులలోకి వెళ్లాల్సిన వర్షపు నీరు వరద రూపంలో నడి రోడ్లను ముంచెత్తుతోంది. మరో పక్క పల్లపు ప్రాంతాలలో నివాసముంటున్న పేద, మధ్య తరగతి ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించి విలువైన వారి వస్తువులన్నీ ప్రతి సంవత్సరం ముంపుకు గురవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అధికారులు లంచాలకు మరిగి అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడం తోనే నగరానికి ఈ పరిస్థితి దాపురించింది.
కొరడా ఝుళిపిస్తున్న జీహెచ్ఎంసీ
కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచారంలో హైదరాబాద్ కు వరద ముప్పు తప్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే చెరువులు ఆక్రమించుకుని భవంతులు, విల్లాలు కట్టుకున్నవారు ఎంత పెద్ద హోదాలో ఉన్నా వారిని వదిలిపెట్టబోమని హామీ ఇచ్చారు. ఇప్పుడు అదే క్రమంలో హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పుడు గ్రేటర్ పరిధిలో చెరువులను ఆక్రమించుకుని కట్లుకున్న ఇంటి యజమానులు హైడ్రా దెబ్బకు వణికిపోతున్నారు.